తొషిబా కార్పొరేషన్‌ చైర్మన్‌ తొలగింపు.. కుట్రలకు చెక్‌ పెడుతు ఉన్నపళంగా ఓటింగ్‌..

By asianet news teluguFirst Published Jun 26, 2021, 6:58 PM IST
Highlights

విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను అణిచివేసేందుకు కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలడంతో తొషిబా కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒసాము నాగాయమాను పదవి నుంచి తొలగించారు. 

 టోక్యో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ తొషిబాలో అవినీతి, కుట్రలకు ఎట్టకేలకు తిరుగుబాటుతో  షేర్‌ హోల్డర్లు చెక్‌ పెట్టారు. తొషిబా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి ఒసామూ నగయమా(74)ను అర్థాంతరంగా తొలగించారు. విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను అణిచివేసేందుకు కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలడంతో ఒసాము నాగాయమా బహిష్కరణకు గురయ్యారు.

శుక్రవారం సాయంత్రం ఒసామూ నగయమా రీ ఎలక్షన్‌ కోసం జరిగిన ఓటింగ్‌ నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. చివరికి ఒసామూను చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తున్నట్లు బోర్డు కావాలనే ఆలస్యంగా ప్రకటించింది. కొంతమంది పెట్టుబడిదారులు దీనిని జపాన్‌లో కార్పొరేట్ పాలనకు కొత్త మైలురాయిగా గుర్తించారు.

జపాన్‌ ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బతీస్తున్నాడని, అధికారులతో కిందటి ఏడాది బోర్డు నామినీల ఓటింగ్‌పై ప్రభావం చూపెట్టాడనేది ఒసామూ నగయమా మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. ఈ కుంభకోణం బయటపడినప్పటికీ ఆయన్నే కొనసాగించాలని పలువురు ఇన్వెస్టర్లు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

also read గ్రీన్‌ ఎనర్జీపై అంబానీ, ఆదానిల కన్ను.. పోటాపోటిగా భారీ పెట్టుబడుల ప్రకటన.. ...

ఈ నేపథ్యంలో ఆయన తొలగింపుపై బోర్డు తొందరపాటు చూపలేదు. అయితే శుక్రవారం సాధారణ సమావేశాల సందర్భంగా ఉన్నపళంగా ఓటింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒసామూ నగయమా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒసామూ మద్దతుదారులు మాత్రం సంక్షోభ సమయంలో ఆయన పనితీరును చూసైనా మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహారిస్తామనే సంకేతాల్ని బయటి ఇన్వెస్టర్లకు తోషిబా పంపినట్లయ్యింది.

జపాన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో ఈ నిర్ణయం ఒక మైలు రాయి అని, ఇక ముందు విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాగా, గతంలో ఒసామూ నగయమా రాజీనామాను డిమాండ్‌ చేసిన తొషిబా అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ భాగస్వామి 3డీ కంపెనీ తాజా పరిణామాలను స్వాగతించింది. ఇక చైర్మన్‌ పదవికి ప్రతిపాదించిన పేర్లను పక్కనపెట్టిన బోర్డు తాత్కాలిక చైర్మన్‌గా తొషిబా సీఈవో సతోషి సునాకవా కొనసాగనున్నారు.

సతోషి సునాకవా ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని సంస్కరణలతో కంపెనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బోర్డు తీర్మానం చేసుకుంది. ​ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న నోబువాకి కురుమటాని కూడా అవినీతి ఆరోపణల విమర్శల నేపథ్యంలో రాజీనామా చేశాడు. జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు తోషిబా బ్రాండ్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తోషిబా జపాన్  పురాతన, అతిపెద్ద సంస్థలలో ఒకటి, గృహ ఎలక్ట్రానిక్స్ నుండి అణు విద్యుత్ కేంద్రాల వరకు విభాగాలు ఉన్నాయి.అయితే మేనేజ్‌మెంట్‌ తప్పిదాలు, సరైన పాలనా-పర్యవేక్షణ లేకపోవడమనే కారణాలు మార్కెట్‌ను కోల్పోతూ వస్తోంది.

click me!