
రష్యా, ఉక్రెయిన్లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అలాగే ప్రపంచ సూచనలతో భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ పతనంతో ప్రారంభమైంది. వారంలోని రెండో ట్రేడింగ్ రోజూన మంగళవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అల్లకల్లోలం నెలకొంది. షేర్ మార్కెట్లోని రెండు సూచీల్లోనూ బలమైన పతనం కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) 30-షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ 1024 పాయింట్లు 57 వేల దిగువకు పడిపోయి 56,659 వద్ద ప్రారంభమైంది, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 299 పాయింట్లు పడిపోయి 17 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం నిఫ్టీ 16,907 వద్ద ట్రేడవుతోంది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో పెట్టుబడిదారులు ఐదు లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.
30 షేర్ సెన్సెక్స్ నష్టాలతో
స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే దాదాపు 254 షేర్లు పెరిగాయి, 1932 షేర్లు క్షీణించాయి అలాగే 48 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు సెన్సెక్స్లోని మొత్తం 30 స్టాక్లు రెడ్ మార్క్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, యూపీఎల్ టాప్ లూజర్స్లో ఉండగా, ఓఎన్జీసీ మాత్రమే లాభపడింది. అంతకుముందు సోమవారం, సెన్సెక్స్ 149 పాయింట్లు పడిపోయి 57,683 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 70 పాయింట్లు నష్టపోయి 17,206 స్థాయి వద్ద ముగిసింది.
ఒక్క భారత్కే కాదు, రష్యా-ఉక్రెయిన్లో తీవ్రరూపం దాల్చిన సంక్షోభ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. ఆసియా నుంచి యూరప్ మార్కెట్లు భారీ క్షీణతను నమోదు చేశాయి. భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఊగిసలాటతో ప్రారంభం కాగా, యూరోపియన్ మార్కెట్లను పరిశీలిస్తే ATSE 0.39 శాతం, CAC 2.04 శాతం, DAX 2.07 శాతం చొప్పున నష్టపోయాయి. ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, ఎస్జిఎక్స్ నిఫ్టీ 1 శాతం నష్టపోగా, హ్యాంగ్ సెంగ్ 3.23 శాతం క్షీణించింది. మరోవైపు షాంఘై ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ 1.19 శాతం నష్టపోగా, తైవాన్ టీ సెక్టార్ 50 ఇండెక్స్ 1.87 శాతం నష్టపోయింది.
ముడి చమురు ధర 96 డాలర్లు దాటింది
స్టాక్ మార్కెట్లలో క్షీణత కొనసాగుతుండగా.. మరోవైపు మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధర 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 96 డాలర్లు దాటింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాద ప్రాంతాల స్వాతంత్రాన్ని గుర్తించారు. రష్యాచే తిరిగి గుర్తించబడిన తూర్పు ఉక్రెయిన్లోని తిరుగుబాటు ప్రాంతాలపై యూఎస్ ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది.