
ఉక్రెయిన్పై రష్యా దాడితో గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం కోలుకుంది. గురువారం దేశీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు భారీగా పతనం అయ్యాయి. దీంతో షేర్ల ధరలు అందుబాటు ధరలో ఉన్నాయి. ఫలితంగా మార్కెట్ ప్రారంభం కావడంతోనే ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీలు లాభాల బాట పట్టాయి. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్ కొసాగుతుందా లేక వెంటనే లాభాలస స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తిగా మారింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గురువారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1144 పాయింట్లు పెరిగి 55, 674 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ(Nifty) 351 పాయింట్లు పెరిగి 16,599 వద్ద కొనసాగుతోంది. గురువారం నాటి పతనాన్ని పెట్టుబడిదారులు ఒక అవకాశంగా భావించారు. దీంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా జంప్ నమోదు చేసింది.
శుక్రవారం ఉయదం 11 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1144 పాయింట్ల లాభంతో 2.10 శాతం వృద్దిని కనబరుస్తూ 55,674 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 351 పాయింట్ల లాభంతో 16,599 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇండస్ ఇండ్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, ఐసీఐసీఐ, టీసీఎస్, ఎస్బీఐ, రిల్ షేర్లు లాభాలు పొందాయి. నిఫ్టీకి సంబంధించి నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, ఇండియా వీఐక్స్ షేర్లు లాభపడుతున్నాయి. టాటా మోటర్స్, టాటా స్టీల్, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్ స్టాక్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్రిటనియా, సిప్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ భయాలు నెలకొన్న మార్కెట్లు రాణిస్తుండటం విశేషం. గురువారం భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడం వల్ల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన గురువారం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న సూచీలు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు కూడా గురువారం నష్టాలు చవిచూశాయి. ఉక్రెయిన్లో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పుతిన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.