
ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ ఊరటనిచ్చింది. బ్యాంకుకు చెందిన డిజిటల్ లాంచ్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు శనివారం స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపింది. అంతేకాక ఈ విషయంపై శనివారమే బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ సెక్టార్లో లీడ్ బ్యాంక్గా గుర్తింపు పొందిన హెచ్డీఎఫ్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. డిజిటల్ వ్యాపార లావాదేవీలపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ మేరకు రిజర్వ్బ్యాంక్ నుంచి తమకు లిఖిపూరక అనుమతులు లభించినట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. డిజిటల్ 2.O కింద తాము ప్రతిపాదించిన లావాదేవీలపై విధించిన నిషేధాన్ని ఆర్బీఐ ఎత్తివేసిందని, త్వరలోనే ఈ సేవలను తాము పునఃప్రారంభిస్తామని పేర్కొంది.
చాలాకాలం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సర్వీసులు ఖాతాదారులకు అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ 2.O పేరుతో దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా సెంటర్లో పదేపదే పొరపాట్లు, సాంకేతిక లోపాలు తలెత్తడంతో రిజర్వ్బ్యాంక్ 2020 డిసెంబర్లో నిషేధం విధించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీతో పాటు డిజిటల్ 2.O ప్రోగ్రామ్ కింద ఎలాంటి లావాదేవీలను నిర్వహించకూడదని అప్పట్లో ఆదేశించింది.
డేటా సెంటర్ స్తంభించిపోవడానికి, ఇందులో చోటు చేసుకునే పొరపాట్లకు ఎవరు జవాబుదారి వహిస్తారనేది తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. దీనికి ఎప్పటికప్పుడు కారణాలను వెల్లడించాలని సూచించింది. గత సంవత్సరం ఆగస్టులో ఈ నిషేధాలను స్వల్పంగా సవరించింది రిజర్వుబ్యాంక్ కొంతమేర సరళీకరించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎత్తేసినట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది. నిషేధ కాలంలో డేటా సెంటర్ పనితీరును మెరుగుపరిచామని పేర్కొంది. గతంలో కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. అయితే గతేడాది ఆగస్టు నెలలోనే బ్యాంకుకు ఆర్బీఐ కాస్త ఊరటనిచ్చింది. క్రెడిట్ కార్డుల జారీకి అనుమతి ఇచ్చింది. తాజాగా పూర్తి ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.