రూ. 2 వేలు తీసుకొచ్చిన ఉద్దేశం నెరవేరింది.. డిపాజిట్ రూ. 50 వేలు మించితే పాన్ తప్పనిసరి: ఆర్‌బీఐ గవర్నర్

By Sumanth KanukulaFirst Published May 22, 2023, 12:21 PM IST
Highlights

రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఆర్‌బీఐ 2000 రూపాయల నోట్లను తీసుకువచ్చిన ఉద్దేశ్యం నెరవేరిందని చెప్పారు.

న్యూఢిల్లీ: రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఆర్‌బీఐ 2000 రూపాయల నోట్లను తీసుకువచ్చిన ఉద్దేశ్యం నెరవేరిందని చెప్పారు. కరెన్సీ నిర్వహణలో భాగమే ఈ నిర్ణయం అని చెప్పారు. రూ. 2,000 కరెన్సీ నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని దాస్ తెలిపారు. భారత కరెన్సీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని.. ఉక్రెయిన్‌లో యుద్ధం, పశ్చిమ దేశాలలోని కొన్ని బ్యాంకుల వైఫల్యం కారణంగా ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం ఉన్నప్పటికీ మారకం రేటు స్థిరంగా ఉందని ఆయన అన్నారు.

‘‘అప్పుడు అమలులో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్నప్పుడు సిస్టమ్ నుండి తీసివేసిన డబ్బు విలువను త్వరగా తిరిగి నింపే ఉద్దేశ్యంతో రూ. 2000 నోట్లు ప్రాథమికంగా జారీ చేయబడినవని మా ప్రెస్ నోట్ లో స్పష్టంగా వివరించాం. ఆ ఉద్దేశ్యం నెరవేరింది.. ఈ రోజు సరిపడినన్ని నోట్లు, ఇతర డినామినేషన్ల చెలామణిలో ఉన్నాయి. 2000 రూపాయల నోట్ల చెలామణి కూడా 6, 73,000 కోట్ల గరిష్ట స్థాయి నుంచి దాదాపు 3, 62,000 కోట్లకు పడిపోయింది. చాలా రోజుల క్రితమే ప్రింటింగ్ కూడా ఆగిపోయింది.ఆ నోట్లు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేశాయి’’ అని శక్తికాంత దాస్ చెప్పారు. 

ఆర్థిక వ్యవస్థపై రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుందని.. మొత్తం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో కేవలం 10.8 శాతం మాత్రమే రూ.2,000 కరెన్సీ నోట్లను జోడించడం జరిగిందని చెప్పారు. ఉపసంహరించుకున్న 2,000 రూపాయల నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర కరెన్సీకి మార్చుకోవచ్చని చెప్పారు. మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించామని ఆయన తెలిపారు. 

సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ. 2,000 నోట్లు ఖజానాకు తిరిగి వస్తాయని భావిస్తున్నామని శక్తికాంత దాస్ చెప్పారు. ‘‘మా వద్ద ఇప్పటికే సిస్టమ్‌లో తగిన పరిమాణంలో ముద్రించిన నోట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఆర్‌బీఐ వద్ద మాత్రమే కాకుండా బ్యాంకులచే నిర్వహించబడే కరెన్సీ చెస్ట్‌లతో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని శక్తికాంత దాస్ తెలిపారు. 

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆర్‌బీఐ సున్నితంగా పరిగణిస్తుందని.. అవసరమైతే నిబంధనలతో బయటకు వస్తుందని చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు జమ చేసేందుకు పాన్ కార్డు అవసరమనే నిబంధన ఉందని.. అదే నిబంధన ఉపసంహరించుకున్న 2000 రూపాయల నోట్ల డిపాజిట్ల కోసం కొనసాగుతుందని ఆయన చెప్పారు. వ్యవస్థలో లిక్విడిటీని రోజూ పర్యవేక్షిస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.

click me!