
ఓవైపు వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై వుండటంతో పాటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త హర్షగోయెంకా . నిత్యం ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంటారు హర్ష. ఆయన జీవిత అనుభవాలతో పాటు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తమిళనాడులోని ఓ ఇడ్లీ సెంటర్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో ఓ ఇడ్లీ సెంటర్ను నడిపిస్తున్నారు. ఇక్కడ రెండు ఇడ్లీలు కేవలం రూ. 3.50 అందిస్తున్నారు.
ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకున్న హర్షగోయెంకా ట్వీట్ చేస్తూ.. ‘తమిళనాడలోని ఈరోడ్లో ఒక ఇడ్లీ మార్కెట్ ఉంది. ఇక్కడ రోజుకు 2వేలకుపైగా ఇడ్లీలు అమ్ముతారని చెప్పారు. రెండు ఇడ్లీలు కేవలం రూ. 3.50 మాత్రమే ఒకవేళ చట్నీ, సాంబార్ కావాలనుకుంటనే రూ. 6.50 చెల్లించాలని హర్షా అన్నారు. ఇండియా చాలా ఆసక్తికరమైన దేశం.. ఇక్కడ స్టార్బక్స్ కాఫీ ధర రూ. 250 ఉంటుంది. కానీ రెండు రుచికరమైన ఇడ్లీలు మాత్రం రూ. 3.50కే లభిస్తాయి’ అంటూ ఆలోచింపజేసేలా క్యాప్షన్ పెట్టారు గోయెంకా.
ఇక జీవిత సారాన్ని తెలుపుతూ హర్షాగోయెంకా చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. జీవితంలో డబ్బు ప్రాధాన్యత గురించి ట్వీట్ చేసిన ఆయన.. ‘డబ్బులు ఉంటే జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది. దాంతో ఎన్ని వస్తువులైనా కొనొచ్చు. కానీ, డబ్బుతో కూడా కొనలేనివీ కొన్ని ఉంటాయి. వాటిని కోల్పోకూడదు. ఒకసారి వాటిని కోల్పోతే తిరిగి పొందలేము’అంటూ ట్వీట్ చేశారు.