ఒకే ఒక్క ఎస్ఎంఎస్: పాన్-ఆధార్ లింక్ చేసుకోండిలా..

By rajashekhar garrepallyFirst Published May 8, 2019, 5:33 PM IST
Highlights

ప్రస్తుతం ఏ ఆర్థిక కార్యకలాపానికైనా, బ్యాంకులకు సంబంధించిన ఏ పనైనా పాన్, ఆధార్ కార్డు అవసరమవుతున్నాయి. ఇక పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఏ ఆర్థిక కార్యకలాపానికైనా, బ్యాంకులకు సంబంధించిన ఏ పనైనా పాన్, ఆధార్ కార్డు అవసరమవుతున్నాయి. ఇక పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30, 2019 వరకు పొడగించింది ఆదాయపుపన్ను శాఖ.

మీరు ఒకవేళ ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోకపోతే ఐటీఆర్ దాఖలు చేయలేరు. అంతేగాక, రూ. 50,000పైన ఉన్న బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించలేరు. 

ప్రస్తుతం పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను  వివిధ మార్గాల్లో అనుసంధానం చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. ఇలా కుదరకపోతే మరో మార్గం కూడా ఉంది. 

కేవలం ఒక ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌తో 567678 లేదా 56161కు ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. యూఐడీపీఏఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

మళ్లీ స్పేస్ ఇచ్చి 10 డిజిట్ల పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పై రెండు నెంబర్లలో ఏదో ఒక దానికి ఎస్ఎంఎస్ పంపాలి. కొన్ని రోజుల తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానంకు సంబంధించి మీకు మెసేజ్ వస్తుంది. దీంతో పాన్, ఆధార్ లింక్ పూర్తయినట్లే.

click me!