
GST Portal Down : కేంద్ర ప్రభుత్వానికి చెందిన జిఎస్టి (వస్తు సేవల పన్ను) పోర్టల్ లో సమస్య తలెత్తింది. దీంతో గత 24 గంటలుగా ఈ పోర్టల్ పనిచేయడంలేదు. నెలవారీ, త్రైమాసిక రిటర్న్ లను దాఖలుచేయడానికి రేపు (జనవరి 11) చివరితేదీ... ఇలాంటి సమయంలో పోర్టల్ డౌన్ కావడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిఎస్టి పోర్టల్ సాంకేతిక సమస్యల నేపథ్యంలో రిటర్న్ సమర్పించడానికి తేదీని పొడిగించాలని వ్యాపారులు కోరుతున్నారు. జనవరి 11 చివరితేదీ కాకుండా వచ్చే సోమవారం అంటే జనవవరి 13 వరకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
జిఎస్టి పోర్టల్ సమస్యపై టెక్నికల్ టీం స్పందించింది. మేంటెనెన్స్ కారణాలతో జిఎస్టి పోర్టల్ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని నిర్దారించింది. మధ్యాహ్నానికి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సమస్యను అర్థంచేసుకుని సహనంతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ జిఎస్టి టెక్ పేరిటగల ఎక్స్ గ్రూప్ ద్వారా ప్రకటన విడుదలచేసారు.