ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

By Sandra Ashok KumarFirst Published Feb 17, 2020, 10:30 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యటనపై భారత కార్పొరేట్లు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు ఉన్నాయి.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి ఈ నెల 24,25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై దేశీయ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండొచ్చునని ఆశిస్తున్నారు. 

ఈ పర్యటనలో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం పటిష్టానికి పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ చెప్పారు.

అమెరికా- భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు విషయమై ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. 

also read ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా?

ట్రంప్ తన పర్యటన నేపథ్యంలో రౌండ్‌ టేబుల్‌ సదస్సులో పలువురు కార్పొరేట్‌ దిగ్గజాలతో ఈ నెల 25వ తేదీన భేటీ కానున్నారు. అమెరికన్‌ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ, భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు.

ద్వైపాక్షిక వాణిజ్య సుంకాలు, తదితర అంశాలపై రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధిస్తోంది. 

జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. 

also read వాలంటైన్స్ డేకు కరోనా వైరస్... అందరూ ఇళ్లలోనే...

వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. 

ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్‌ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టాయి. 

భారతీయ కంపెనీలు 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 2018–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దిగుమతులు 35.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.   

click me!