
బిజినెస్ సక్సెస్ కావడానికి చదువు ఎంత వరకు దోహపడుతుందన్న సందేహం చాలా మందికి ఎప్పుడో అప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే కొందరికి విద్యార్హత ప్లస్ పాయింట్గా మారితే.. మరికొందరికి ఏ చదువు లేకపోయినా తమ తెలివి తేటలతో విజయం వరిస్తుంది. ఇక దేశంలోనే అత్యంత సంపన్నులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ అదానీ సక్సెస్కు కారణం ఏంటి ? వారి చదువు ఏంటి..?
ముకేష్ అంబానీ ఏం చదువుకున్నారంటే..!
ప్రపంచంలోనే టాప్ టెన్ బిలియనీర్లలో భారత్ నుంచి తొలిసారి స్థానం సంపాదించుకున్న వ్యాపారవేత్తగా ముకేష్ అంబానీ ఖ్యాతి గడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను అంతకంతకూ విస్తరిస్తూ దూసుకుపోతున్నారు. ముకేష్ అంబానీ తన పాఠశాల విద్యను ముంబైలోని హిల్ గ్రాంజ్ హైస్కూల్ నుంచి పూర్తి చేశారు. సెయింట్ జావియర్ కాలేజీలో చదివారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేశారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ముఖేష్ అంబానీ ఎంబీఏలో చేరారు. అయితే తరగతి గదిలో నేర్చుకునే దాని కంటే వాస్తవిక అనుభవం పొందాలన్న తన తండ్రి ధీరూభాయ్ సూచన మేరకు ఎంబీఏ చదువు మధ్యలోనే ఆపేసి భారత్ తిరిగి వచ్చేశారు.
అదానీ ఏం చదువుకున్నారంటే..!
దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. గుజరాత్లోని శెఠ్ చిమన్లాల్ నాగిన్దాస్ విద్యాలయ నుంచి తన పాఠశాల విద్య పూర్తి చేశారు. డిగ్రీ కామర్స్ గ్రూప్లో చేరారు. అయితే డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా చదువు మానేసి వ్యాపారం వైపు దృష్టి సారించారు.
చదువు మానేసిన వెంటనే గౌతమ్ అదానీ.. ముంబై వెళ్లి అక్కడ మహేంద్ర బ్రదర్స్ వద్ద వజ్రాలు సానబెట్టే పనిలో చేరారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద 200 బిలియన్ డాలర్లపైనే ఉంటుంది. అంబానీకి 93.5 బిలియన్ డాలర్లు, అదానీకి 98.1 బిలియన్ డాలర్ల నికర సంపద విలువ కలిగి ఉన్నారు. మొత్తమ్మీద ఈ ఇరువురు పెద్ద చదువులు చదవకపోయినా.. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. ప్రపంచ కుబేరుల జాబితాలతో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం.