కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్లు ఉంది మోదీ సర్కార్ పరిస్థితి. రెండేళ్ల క్రితం గొప్పగా అవినీతి రద్దు కోసం నోట్ల రద్దని, ఒకేదేశం- ఒకే పన్ను నినాదం పేరిట ఆదరాబాదరా తెచ్చిన జీఎస్టీ దేశీయ ఆర్థిక వ్యవస్థ మనుగడనే సవాల్ చేస్తున్నాయి.
అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినా భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరమే. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు. ఖాళీ ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి.
జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది.
లక్ష్యాలకు దూరంగా పరోక్ష పన్ను వసూళ్లు
పరోక్ష పన్నుల వసూళ్లు నిర్దేశిత లక్ష్య సాధనకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. నిర్దేశిత జీఎస్టీ వసూళ్లలో లక్ష సాధన ప్రకారం గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం.
దేశంలోని 11 బ్యాంకులు ఇలా దివాళా
దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాళా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు.
బ్యాంకింగ్ రంగంలో పేరుకున్న రూ. 12 లక్షల కోట్ల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపేసినా పరిస్థితి మెరుగుపడలేదు.
రైతుల ఆందోళన పట్టని కేంద్రం
రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేదంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల నాటికి నిధుల కొరత సమస్య పక్కా?
సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల నాటికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది.
అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రిజర్వ్ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్ నిధులు రూ. 9.6 లక్షల కోట్లు ఉండగా, అందులో ఆపధర్మ నిధి కింద రూ. 3.6 లక్షల కోట్లు.
ఏ ప్రభుత్వానికి రిజర్వు నిధులు కేటాయించని ఆర్బీఐ
దేశంలోని బంగారం, ఫారెక్స్ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు ఆర్బీఐ ఈ రిజర్వ్ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్లో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు.
ఉర్జిత్ పటేల్పై అదే ఒత్తిడి
ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న ఉర్జిత్ పటేల్పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్ కింద స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉర్జిత్కు హెచ్చరించారు కూడా.
స్వయంప్రతిపత్తిపై కేంద్రం ఇలా పెత్తనం యత్నం?
ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించినా ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తేలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు.
ఆపద్ధర్మ నిధుల బదలాయింపుతో ఇవీ సమస్యలు
మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్ పటేల్ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలిసినందునే కానీ రూ. 2 రెండు లక్షల కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. .
కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆర్బీఐకి ఇలా..
ఉర్జిత్ పటేల్ రాజీనామాతో ఆయన స్థానంలో 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ను తెచ్చారు. ఆయన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్.
ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్గా ఐఏఎస్ ఆఫీసర్ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్–ఐసీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే.
ఆర్బీఐకి తొలిసారి ఆర్థిక వేత్త గాని గవర్నర్
1990లో ఎస్. వెంకటరామన్ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తేవడం ఇదే తొలిసారి. కొత్త గవర్నర్ శక్తి కాంత దాస్ కేంద్ర ప్రభుత్వం మాట వింటారా? అంటే అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దుతో ఏర్పడిన సంక్షోభంలో అనుక్షణం కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు.
అసలేం జరుగుతోంది.. శక్తికాంత దాస్ ఏం చేస్తారు?
మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. దీన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీ గట్టెక్కవచ్చు.
భారత్పై మున్ముందు సవాళ్లు ఇలా
ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులను (మన రిజర్వ్ బ్యాంక్కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి.