
దేశీయ మార్కెట్లకు పలు పాజిటివ్ సంకేతాలు అందుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ లు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ సూచీ 240.85 పాయింట్లు లాభపడి 16,871.30 వద్ద ముగియగా, సెన్సెక్స్ 935.72 పాయింట్లు లాభపడి 56,486.02 పాయింట్ల వద్ద ముగిసింది.
సెక్టార్ల పరంగా చూస్తే ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ ఐటీ సూచీ 1.92 శాతం లాభపడగా, నిఫ్టీ బ్యాంక్ సూచీ 2.22 శాతం లాభపడింది. అలాగే పీఎస్యూ బ్యాంకులు సైతం లాభపడ్డాయి. దీంతో పాటు ఇన్ఫ్రా, సర్వీస్ సెక్టార్, ఆటో, మీడియా రంగాలకు చెందిన స్టాక్స్ కూడా లాభాలను అందుకున్నాయి.
నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ ఉండగా, టాప్ లూజర్లుగా ఐఓసీ, ఓఎన్జీసీ, హెచ్యూఎల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి.
గత నాలుగు వరుస సెషన్లలో లాభాలకు ఈ 5 సెషన్ కూడా తోడవతంతో , స్టాక్ మార్కెట్లు రికవరీ బాటపడుతున్నాయి. ఈ వారంలో వరుసగా ఉన్న ప్రధాన సెంట్రల్ బ్యాంక్ సమావేశాలపై పెట్టుబడిదారుల దృష్టి మళ్లింది.
దేశీయంగా, రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, టోకు ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, ఎఫ్ఐఐల తీరు ఈ వారంలో స్టాక్ మార్కెట్లకు కీలకమైన ట్రిగ్గర్లుగా ఉంటాయి. హోలీ సందర్భంగా ఈక్విటీ మార్కెట్లు మార్చి 18న సెలవు ప్రకటించారు..
మరోవైపు రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవాలని భారత్ ఆలోచిస్తోంది. ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాపై కఠినమైన పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య, రూపీ-రూబుల్ లావాదేవీ ద్వారా ముడి చమురు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసుకోమని రష్యా అందిస్తున్న ఆఫర్ పై భారత్ పరిశీలిస్తోంది, ఈ విషయమై ఇద్దరు భారతీయ అధికారులు తెలిపారు.
సాధారణంగా మన దేశ చమురు అవసరాలలో 80% దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, చమురు ధరలు 40% పెరగడంతో, పెరుగుతున్న ఇంధన బిల్లును తగ్గించడంలో రష్యా అందిస్తున్న చవక ఇంధనం సహాయపడుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.