వచ్చే నెలలో వరుసగా 5 రోజులూ బ్యాంకులు మూతే

By narsimha lodeFirst Published Feb 9, 2020, 3:15 PM IST
Highlights

మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులు దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. వచ్చే నెల 14 రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం సెలవు దినం కావడంతో బ్యాంకులు వరుసగా ఐదు రోజులు మూతపడనున్నాయి. 

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులకు రెండేళ్లుగా వేతన సవరణ జరుగలేదు. ఫలితంగా తమకు తక్షణం వేతన సవరణ జరుగాలని కోరుతూ గత నెల 31, ఈ నెల ఒకటో తేదీల్లో వరుసగా రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. ఇదే డిమాండ్‌తో మూతపడిన బ్యాంకులు వచ్చే నెలలో 3 రోజులు మూత పడ నున్నాయి.

వేతన పెంపు, వారానికి ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌తో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.

దీంతో  మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులు దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. వచ్చే నెల 14 రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం సెలవు దినం కావడంతో బ్యాంకులు వరుసగా ఐదు రోజులు మూతపడనున్నాయి. 

అయితే, ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకుల కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.  తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. 

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ వేతనాలను సవరించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారి 2012లో ఉద్యోగుల వేతనాలు సవరించారు. ఆ తర్వాత 2017లో సవరించాల్సి ఉండగా ఇప్పటి వరకు అది అమలు కాలేదు. 

వేతనాల సవరణ కోసం బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు పలుమార్లు చర్చలు జరిపినా విఫలమయ్యాయి. తమ వేతనంపై 20 శాతం పెంపు కావాలని బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్లు పట్టుబడుతున్నాయి.

అయితే, భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) మాత్రం 19 శాతం వేతన సవరణ మాత్రమే ఇస్తామని చెబుతోంది. అలాగే వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

దేశంలో పబ్లిక్ హాలీడేలు గణనీయంగా ఉండడంతో అది సాధ్యం కాదని ఐబీఏ తేల్చి చెప్పింది. ప్రతి శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడితే ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని చెబుతూ వారి డిమాండ్‌ను నిరాకరిస్తోంది.
 

click me!