
మీరు ఎస్బీఐ ఖాతాదారా? అయితే మీకు ఓ హెచ్చరిక. సోమవారం(మార్చి 28) నుంచి రెండు రోజుల సమ్మెకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్బీఐ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. వివిధ ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనున్న నేపథ్యంలో ఆ ప్రభావం బ్యాంకింగ్ సేవలపై పడొచ్చని తెలిపింది. ఎస్బీఐ శాఖలు, ఏటీఎం సర్వీసులపై ఈ ప్రభావం అధికంగా ఉండొచ్చని పేర్కొంది.
'అవసరమైన ఏర్పాట్లు చేసినా.. సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పరిమితంగా జరగొచ్చు.' అని ఎస్బీఐ వివరించింది. అందుకే ఎస్బీఐ ఖాతాదారులు తమకు ఏదైనా పని ఉంటే దానిని వాయిదా చేసుకోవడం ఉత్తమమని సంకేతాలిచ్చింది. అత్యవసమైన పనులు ఉంటేనే బ్యాంక్కు రావాలని కూడా సూచించింది. ఇక డబ్బులు అవసరమైన వారు ఏటీఎంల నుంచి ముందుగానే విత్డ్రా చేసుకోవడం బెటర్ అని తెలుస్తోంది.
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారతీయ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ (బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ)లు సమ్మెకు దిగుతున్నట్లు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింక్ కార్యాకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నట్లు పేర్కొంది ఎస్బీఐ. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలపై కూడా ప్రభావం పడనుంది.
సమ్మె ఎందుకు..?
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనుండటం సహా.. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు 2021కు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో మార్చి 28, 29 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంక్ యూనియన్లు. ప్రభుత్వ ఆదాయ ప్రణాళికల్లో భాగంగా.. రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం 2021 బడ్జెట్లో నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు బ్యాంకులను ఇప్పటికే ఎంపిక చేసింది. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలో కూడా నోటీసులు ఇచ్చాయి బ్యాంకింగ్ యూనియన్లు.