స్విస్ ఓపెన్ విజేత ‘సింధు’.. దేశ యువతకు ప్రేరణ అన్న ప్రధాని, జాతి గర్వించేలా చేశావంటూ.. జగన్ ప్రశంసల జల్లు..

By SumaBala BukkaFirst Published Mar 28, 2022, 8:54 AM IST
Highlights

బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధూ తన ఖాతాలో మరో ఆణిముత్యాన్ని చేర్చుకుంది. తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఆమె సాధించిన ఈ విజయానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

బాసెల్ :  మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత badminton స్టార్ క్రీడాకారిణి PV Sindhu ఈ ఏడాది తన ఖాతాలో రెండో 
International titleను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన 
Swiss Open World Tour Super-300 Tournamentలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ చాంపియన్ గా  అవతరించింది.  గత ఏడాది కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఫైనల్లో ఓడిపోయి, రన్నరప్ గా నిలిచిన సింధూ ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచింది.

ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్ బమ్ రుంగ్ ఫన్(థాయ్ లాండ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు,  21-16, 21-8తో గెలిచింది. అంతర్జాతీయ టోర్నీలలో బుసానన్ మీద సింధుకు ఇది 16వ విజయం కావడం విశేషం. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సింధుకు తొలి గేమ్ లో గట్టిపోటీనే ఎదురయ్యింది. అయితే స్కోరు 16-15 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి 18-15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తరువాత ఒక పాయింట్ ను బుసానన్ కు కోల్పోయిన సింధు ఆ వెంటనే మూడు పాయింట్లు నెగ్గి గేమ్ ను సొంతం చేసుకుంది. 

రెండో గేమ్ లో సింధు ఆరంభం నుంచే చెలరేగిపోగా బుసానన్ డీలా పడిపోయింద. స్కోరు 12-4 వద్ద సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20-4 తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తరువాత బుసానన్ కు వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకున్నాక సింధు ఒక పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన సింధుకు 13,500 డాలర్ల (రూ.10 లక్షల 29వేలు) ప్రైజ్ మనీతో పాటు 7,000 ర్యాకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సింధుకు ఇది రెండో టైటిల్. గత జనవరిలో ఆమె సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. 

పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్,  2016 ఛాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ రన్నరప్ గా నిలిచాడు. కేరళకు చెందిన ప్రణయ్  ఫైనల్లో  12- 21, 18- 21తో  2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ ( ఇండోనేషియా) చేతిలో ఓడిపోయాడు.

ప్రధాని మోదీ, సీఎం జగన్ అభినందన..
స్విస్ ఓపెన్ విజేత సింధును ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.  ‘సింధు విజయాలు దేశ యువతకు ప్రేరణ నిస్తాయి. భవిష్యత్తులో ఆమె మరిన్ని టోర్నీలలో రాణించాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. 

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సింధును అభినందించారు. ‘స్విస్ ఓపెన్ గెలిచిన పీవీ సింధుకు కంగ్రాట్స్, మన జాతి గర్వించేలా చేశావు.. ఈ సందర్భంగా ఆమెను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరిన తెలుగు తేజం.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయిలాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్ బమ్ రుంగ్ ఫన్ పై 21-16,21-8  వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్ లో రెండు సింగిల్స్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. 

click me!