సుదీర్ఘ విరామం: భారత మార్కెట్లోకి లాంబ్రెటా విద్యుత్ స్కూటర్లు

By rajesh yFirst Published Dec 15, 2018, 12:07 PM IST
Highlights

ఇటలీ ఆటోమొబైల్ మేజర్ లాంబ్రెట్టాతో కలిసి భారత మార్కెట్లోకి విద్యుత్ ఆధారిత స్కూటర్‌ను తేనున్నట్లు భారత ప్రభుత్వ రంగ సంస్థ స్కూటర్స్ ఇండియా తెలిపింది. ఇందుకు ఎన్టీపీసీ, ఈవీఐ టెక్నాలజీస్‌, మురాటా టెక్నాలజీస్ తదితర సంస్థలతో సంప్రదిస్తున్నామని పేర్కొంది.

న్యూఢిల్లీ: మళ్లీ భారత మార్కెట్‌లోకి అలనాటి ప్రముఖ స్కూటర్‌ బ్రాండ్‌ ‘లాంబ్రెటా’ రాబోతున్నది. ఈసారి విద్యుత్ వాహనాల వెర్షన్‌లో విడుదల కానున్నది. ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు  ప్రభుత్వ రంగ సంస్థ స్కూటర్స్‌ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా అలనాటి ప్రముఖ బ్రాండ్‌ ‘లాంబ్రెటా’లో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉందని సంస్థ తెలిపింది.

ఇటలీకి చెందిన ఈ బ్రాండ్‌ను గతంలోనూ (1972లో) ఈ సంస్థే భారత్‌ మార్కెట్‌లోకి తెచ్చింది. భవిష్యత్‌ రోడ్‌మ్యాప్‌పై చర్చించేందుకు శుక్రవారం సమావేశమైన స్కూటర్స్‌ ఇండియా బోర్డు.. ఎలక్ట్రిక్‌ వాహనాలతోపాటు మరిన్ని కొత్త విభాగాల్లో వాహనాలను విడుదల చేయాలని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సంస్థ సమాచారం అందించింది.

ప్యాసింజర్‌ వెహికల్స్‌తోపాటు కార్గో రవాణా సెగ్మెంట్లలో విక్రమ్‌ ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలను విడుదల చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతిక, విడిభాగాల సరఫరా కోసం ఇతర ప్రభుత్వ రంగ సంస్థలైన భెల్‌, ఎన్‌టీపీసీతోపాటు ఈవీఐ టెక్నాలజీస్‌, మురాటా టెక్నాలజీస్‌, జపాన్‌ సన్‌ మొబిలిటీతో సంప్రదిస్తున్నామని స్కూటర్స్‌ ఇండియా తెలిపింది.

హోండా కార్లు మరింత ప్రియం
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ధరలు పెంచే కార్ల సంస్థల్లో హోండా కూడా చేరింది. ఉత్పత్తి ఖర్చులు నాలుగు శాతం పెరగడంతో ధరలు పెంచే విషయం ఆలోచిస్తున్నట్టు తెలిపింది. ఎంత మేరకు పెంచాలనే దానిపై కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మోడల్‌ కార్ల ధరలు పెరుగుతాయని మాత్రం తెలిపింది. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట్టు మారుతి సుజుకీ, టొయోటా కిర్లోస్కర్‌, బీఎండబ్ల్యు, రెనో, ఇసుజు, టాటా మోటార్స్‌, ఫోర్డ్‌ ఇండియా, నిస్సాన్‌ ఇండియా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.

click me!