భారత్ విపణిలోకి ‘డుకాటీ’ స్పెషల్ ఎడిషన్

By sivanagaprasad kodatiFirst Published Sep 26, 2018, 9:26 AM IST
Highlights

టలీ సూపర్‌ బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ కొత్త ‘959 పానిగేల్‌ కోర్స్‌’ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.15.2 లక్షలుగా నిర్ణయించారు. ప్రత్యేక ఎడిషన్‌లో భాగంగా భారత్‌కు ఈ మోటారు సైకిల్ రానున్నది.

ఇటలీ సూపర్‌ బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ కొత్త ‘959 పానిగేల్‌ కోర్స్‌’ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.15.2 లక్షలుగా నిర్ణయించారు. ప్రత్యేక ఎడిషన్‌లో భాగంగా భారత్‌కు ఈ మోటారు సైకిల్ రానున్నది. డుకాటీ కోర్స్‌ మోటోజీపీ రంగుల నుంచి స్ఫూర్తి పొందినట్లు కంపెనీ తెలిపింది. 955 సీసీ ఇంజిన్‌ కల ఈ బైక్.. 157 హార్స్‌పవర్‌ శక్తిని అందిస్తుంది. 

డుకాటీలో స్పెషల్ అట్రాక్షన్లు ఎన్నో..
బాష్‌ నుంచి ఏబీఎస్‌, డుకాటీ ట్రాక్షన్‌ కంట్రోల్‌, డుకాటీ క్విక్‌ షిప్ట్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, రైడ్‌ బై వైర్‌ వంటి అధునాతన వసతులు ఇందులో ఉన్నాయి. మూడు రైడింగ్‌ మోడ్‌లు రేస్‌, స్పోర్ట్‌, వెట్‌లు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ కొనుగోళ్ల కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ వెల్లడించింది.

అయితే స్టాండర్డ్ వర్షన్ మోటార్ బైక్ కంటే డుకాటీ 959 పానిగేల్ కోర్స్ బైక్ రూ.67 వేలు ఎక్కువ. యూరో నాలుగో తరం 955 సీసీ సామర్థ్యం గల సూపర్ క్వాండ్రో ఇంజిన్‌తో 150 హెచ్పీ విద్యుత్, 102 ఎన్ఎం టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్సును కలిగి ఉంది. భారత్‌కు వచ్చే డుకాటీ మోడల్ బైక్‌లోఓహ్లిన్స్ స్టీరింగ్ డంపర్, ఆక్రాపోవిక్ తో తయారు చేసిన టైటానియం సైలెన్సర్లు  లభించవు.

వచ్చే జూన్‌నాటికి మార్కెట్ లోకి ఆరు ‘ట్రయంప్’ బైక్స్
బ్రిటన్‌కు చెందిన సూపర్‌ బైక్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ భారత్‌లో భారీగా మార్కెట్‌ వాటాను పెంచుకోవాలన్న వ్యూహంతో ఉంది. ఇందులో భాగంగా వచ్చే జూన్‌ నాటికి ఆరు బైక్‌లను విడుదల చేయాలనుకుంటోంది. వీటిలో కొన్ని కొత్త మోడళ్లుకాగా కొన్ని ప్రస్తుత మోడళ్లకు అప్‌గ్రేడ్‌ వెర్షన్లు.

ప్రస్తుతం ఈ కంపెనీ విక్రయిస్తున్న 13 బైక్‌ల (వేరియంట్లు సహా) ధరల శ్రేణి రూ.7.7 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంది. దేశవ్యాప్తంగా 16 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వచ్చే మూడునాలుగేళ్లలో వీటి సంఖ్యను 25కు పెంచుకోవాలన్న యోచనలో సంస్థ ఉంది.

కంపెనీకి 400 నగరాలు, పట్టణాల్లో కస్టమర్లు ఉన్నారు. కానీ 20 నగరాల్లోని అమ్మకాల వాటాయే 65-70 శాతం ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నామని ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ (ఇండియా) జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ తెలిపారు.
 
డీలర్‌ నెట్‌వర్క్‌ విస్తరణపై ట్రయంఫ్‌ దృష్టి
ఐదేళ్లలో ప్రీమియం మోటార్‌సైకిల్‌ విభాగం (500 సిసి, అంతకు మించి) వార్షికంగా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నట్టు ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ (ఇండియా) జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ చెప్పారు. ఇదే సమయంలో సాధారణ ద్విచక్ర వాహనాల మార్కెట్లో 6-7 శాతం వృద్ధి నమోదవుతోందని తెలిపారు.

గత ఐదేళ్లకాలంలో ట్రయంఫ్‌ 47 శాతం వృద్ధిని సాధించినట్టు ఆయన చెప్పారు. దేశీయంగా ప్రీమియం సెగ్మెంట్‌ పరిశ్రమ పరిమాణం వార్షికంగా 7,500 యూనిట్లుగా ఉందని, గత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్లో ట్రయంఫ్‌ వాటా 20 శాతంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో ఈ పరిశ్రమ 10-15 శాతం వృద్ధిని సాధించి వార్షికంగా 13,000 బైకుల అమ్మకాలను నమోదు చేసుకునే స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

click me!