కేఏ పాల్ తన ఎన్నికల గుర్తుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా ఒకే అభ్యర్ధి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ తెచ్చుకున్నాడు.
ఎన్నికలంటేనే అదోక రణరంగం .. ఏం చేసైనా సరే ఇక్కడ గెలవాలి.. ఇదొక్కటే పార్టీలకు ముఖ్యం. ఈ క్రమంలో గెలవడం కోసం అధినేతలు ఎక్కడిదాకైనా వెళతారు. ఇక ఎత్తులు, పైఎత్తులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజాగా ఎన్నికల గుర్తులతో పార్టీలు గిమ్మిక్కులు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ద్వారా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధినేత, కేఏ పాల్ తన ఎన్నికల గుర్తుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
అత్యంత వ్యూహాత్మకంగా ఒకే అభ్యర్ధి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ తెచ్చుకున్నాడు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను వెతికి మరి పోటీకి దించారు.
ఈ విధంగా నామినేషన్ల పర్వం చివరి రోజున ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. అలాగే ఈవీఎంలో వైసీపీ గుర్తు కిందే హెలికాఫ్టర్ గుర్తు వచ్చేలా పాల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న ప్రజాశాంతి అభ్యర్థులు వీరే:
రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి (వైసీపీ), ఉండాల రామచంద్రారెడ్డి (ప్రజాశాంతి)
ఉరవకొండ- విశ్వేశ్వర్రెడ్డి (వైసీపీ), కె.విశ్వనాథ్ రెడ్డి (ప్రజాశాంతి)
అనంత అర్బన్- అనంత వెంకట్రామిరెడ్డి (వైసీపీ), పగడి వెంకటరామిరెడ్డి (ప్రజాశాంతి)
కళ్యాణదుర్గం- ఉషాశ్రీ చరణ్ (వైసీపీ), ఉషారాణి నేసే ( ప్రజాశాంతి)
రాప్తాడు- తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (వైసీపీ), డి ప్రకాశ్ (ప్రజాశాంతి)
పెనుకొండ- ఎం.శంకర్ నారాయణ(వైసీపీ), ఎస్.శంకర్ నారాయణ (ప్రజాశాంతి)
ధర్మవరం- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (వైసీపీ), పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి (ప్రజాశాంతి)
కదిరి- సిద్దారెడ్డి (వైసీపీ), సన్నక సిద్దారెడ్డి (ప్రజాశాంతి)