మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయనగా... కర్నూలు జిల్లాలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.
మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయనగా... కర్నూలు జిల్లాలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి మంత్రి అఖిలప్రియకు ఝలక్ ఇచ్చారు. టీడీపీ ని కాదని.. వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపింది.
మంగళవారం వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రరెడ్డితో పాటూ కుటుంబ సభ్యలు ప్రతాప్రెడ్డిని కలిశారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించి.. బిజేంద్రకు ప్రతాప్రెడ్డి సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఆళ్లగడ్డలో గంగుల వర్గీయులు, ప్రజలు బిజేంద్రరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల ప్రతాప్రెడ్డి కోరారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు తనను సాయం కోరారని.. అందుకే టీడీపీ అభ్యర్థి కోసం పనిచేశానన్నారు. పార్టీలో చేరిక సమయంలో నంద్యాల పార్లమెంట్కు సరైన అభ్యర్థి ఎవరూ లేరని తనతో చెప్పారన్నారు. కానీ అభ్యర్థిని తనకు చెప్పకుండానే ఎంపిక చేశారన్నారు.
అందుకే తాను ఇప్పుడు టీడీపీని కాదని వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. పార్టీ గెలుపు కోసం పనిచేశారు.. ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలని భావించారు. నంద్యాల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు గంగుల దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా.. వైసీపీకి తన మద్దతు తెలిపి అందరికీ షాక్ ఇచ్చారు.