వైఎస్ జగన్ ఓటుకే ఎసరు: ఫారం - 7 దాఖలు

By telugu teamFirst Published Mar 13, 2019, 7:36 AM IST
Highlights

వైఎస్ జగన్ ఓటుకు కూడా ఎసరు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు తాజాగా వెలుగు చూశాయి.వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్‌ జగన్‌ పేరు మీద ఈనెల 9వ తేదీన దరఖాస్తు దాఖలయ్యింది.

కడప: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేతల ఓట్లను కూడా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ ఓటుకు కూడా ఎసరు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు తాజాగా వెలుగు చూశాయి.వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్‌ జగన్‌ పేరు మీద ఈనెల 9వ తేదీన దరఖాస్తు దాఖలయ్యింది. అయితే ఈ విషయం ఇప్పటివరకు బహిర్గతం కాకుండా తహసీల్దారు, రిటర్నింగ్‌ అధికారి సత్యం జాగ్రత్త పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో రిటర్నింగ్‌ అధికారిని మీడియా సంప్రదిస్తే ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని ఎవరు, ఎక్కడ్నుంచి అప్‌లోడ్‌ చేశారనే ప్రశ్నలకు ఆయన జవాబివ్వలేదు.ఈ విషయమై స్పష్టత కోసం జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు జనార్దనరెడ్డిని విచారించగా జగన్‌మోహన్‌రెడ్డి దరఖాస్తు చేయలేదని చెప్పారని రిటర్నింగ్‌ అధికారి చెప్పారు. 

దీంతో ఆయన వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ చిన్నాన్న వివేకా ఓటును మాత్రమే కాకుండా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఓటు తొలగించాలంటూ ఫారం–7 దాఖలైన విషయం తెలిసిందే. 

click me!