Jagan: ఏ బుక్కులో రాసుకుంటారో రాసుకోండి.. ఎవ్వడినీ వదిలిపెట్టేది లేదు : మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్

Published : May 20, 2025, 08:46 PM IST
YS JAGAN

సారాంశం

YS Jagan Mohan Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్యాయం చేసినవారిని వదలమని, దేశం విడిచి వెళ్లినా రప్పించి వాళ్ల‌కు సినిమా చూపిస్తామ‌ని మాస్ వార్నింగ్ ఇచ్చారు.  

YS Jagan Mohan Reddy: "మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు అన్ని రాసి పెట్టుకోండి.. ఏ బుక్ లో అయినా రాసిపెట్టుకోండి.. రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం.. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాము.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి గెలిచిన తరువాత సినిమా చూపిస్తామంటూ" ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి శ్రీ సత్యసాయి జిల్లా వరకు పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం చేసిన వారిని వదలమనీ, అవసరమైతే దేశం విడిచిపోయినా రప్పించి చర్యలు తీసుకుంటామన్నారు.

‘‘మీరు ఏ బుక్కులో పేరు రాసుకుంటారో రాసుకోండి. మేము మాత్రం అన్యాయం చేసిన వాళ్లకు సినిమా చూపిస్తాం. ఒక్కొక్కడికి ఎలా చూపించాలో అలా చూపిస్తాం. ఎవ్వడినీ వదలము’’ అని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వంపై ప్ర‌జ‌ల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంద‌ని అన్నారు. “చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. ప్రజలకు పరోక్షంగా వెన్నుపోటు పెట్టారు. ఇప్పుడు ప్రజలు ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ తన్నినట్టుగా తంతారు” అని అన్నారు.

 

 

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న అన్యాయాలపై జగన్ మండిపడ్డారు. “సంఖ్యాబలం లేకున్నా టీడీపీ పోటీకి పెట్టి, పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. టీడీపీ వాళ్లను వదిలేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు” అని మండిపడ్డారు. అలాగే, ‘‘ఇప్పుడు మీ కష్టాలను చూస్తున్నాను. కానీ మనకు టైం వస్తుంది. రాబోయే జగన్ 2.O ప్రభుత్వంలో కార్యకర్తే నంబర్ వన్” అని హామీ ఇచ్చారు.

ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా వంటి పథకాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రూ.3,600 కోట్లు పెండింగ్‌లో పెట్టారని, వైద్యం కోసం ప్రజలు అప్పులు చేస్తున్న స్థితి వచ్చిందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదని అన్నారు.

‘‘మనం ప్రారంభించిన మూడు పోర్టులు ఇప్పుడు కమిషన్ల కోసం అమ్మే ప్రయత్నం జరుగుతోంది. ట్రైబల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాలేజీలు, ఆసుపత్రులు అన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన ప్ర‌గ‌తి కాగా.. ఇప్పుడు అవన్నీ నాశనం చేయాలని చూస్తున్నారు” అని జగన్ వ్యాఖ్యానించారు. ‘‘తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి, నెల‌ల తరబడి మహిళలను, ఎంపీలను జైల్లో పెడుతున్నారు. ఇది ఎప్పుడూ లేని విధమైన పాలన” అని జగన్ విమర్శించారు. ‘‘వచ్చే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాడాలి. మంచిరోజులు వస్తాయి. మన ప్రభుత్వమే తిరిగి వస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gorantla Madhav Pressmeet: లోకేష్ నీ ఎర్రబుక్ ముయ్ పోలీస్ స్టేషన్ లో గోరంట్ల | Asianet News Telugu
నాకు మా మామకు చిచ్చు పెడుతున్నారేంటిరా బాబు | పడి పడి నవ్విన Nara Lokesh | Asianet News Telugu