డబ్బులపై ఆసక్తి లేదు, విశాఖలోనే స్థిరపడాలని కోరిక: విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Sep 2, 2021, 11:33 AM IST
Highlights

విశాఖపట్టణంలోనే తనకు స్థిరపడాలనే కోరిక ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తనకు డబ్బులపై ఆసక్తిలేదని ఆయన తేల్చి చెప్పారు. తన పేరున అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.

విశాఖపట్టణం: తనకు డబ్బుపై ఆసక్తిలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  చెప్పారు. తాను హైద్రాబాద్‌లో కూడా అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్న విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వర్ధంతి సభలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపేరుతో భూ ఆక్రమణలకు చట్టప్రకారంగా చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. 

తాను విశాఖలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకొంటున్నానని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై ఆయన స్పందించారు. విశాఖలో ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించినా కూడా తాను సహించబోనని ఆయన తేల్చి చెప్పారు.

 తమ పార్టీకి చెందినవారైనా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆయన వివరించారు. త్వరలోనే రెండు టోల్‌ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఆయన చెప్పారు.ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు తన పేరున ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

తన పేరున కానీ, తన కుటుంబం పేరున కానీ ఎలాంటి ఆస్తులు లేవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. తనకు విశాఖలోనే స్థిరపడాలని కోరిక ఉందన్నారు. భీమిలీకి దూరంగా  నాలుగైదు ఎకరాల  వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడే తనువు చాలిస్తానని ఆయన ప్రకటించారు.

click me!