
విజయవాడ: అధికార వైసిపి ఎంపీ నందిగాం సురేష్ (nandigam suresh) తో పాటు ఆయన అనుచరులు విజయవాడ (vijayawada)లో హల్ చల్ చేసారు. గత అర్ధరాత్రి కృష్ణలంక పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడమే ఎంపీ కోపానికి కారణమయ్యింది. ఇలా పోలీస్ స్టేషన్ కు తరలించిన యువకుల్లో తన మేనల్లుడు వుండటంతో ఎంపీ సురేష్ స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి అలజడి రేగింది.
వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి ఎంపీ నందిగాం సురేష్ మేనల్లుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విజయవాడలోని స్వర్ష మల్టిప్లెక్స్ లో సినిమాకు వెళ్లారు. అయితే సినిమా ముగిసిన తర్వాత వీరు అదే బైక్ పై ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి రోడ్డుపై వాహనాలేవీ లేకపోవడంతో బైక్ ను వేగంగా పోనిచ్చారు. ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వీరిని బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కృష్ణలంక ఆపారు.
ఈ క్రమంలో పోలీసులతో యువకులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్విదానికి దిగడంతో ఆగ్రహించిన ఎస్సై వీరిపై చేయిచేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై తమపై దాడిచేయడాన్ని వీడియో తీసిన యువకుటు ఎంపీ నందిగాం సురేష్ కు పంపించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన అనుచరులతో కలిసి అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
తమవారిపై చేయిచేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ వెంట వచ్చిన అనుచరులు ఎస్సైతో పాటు ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాదు బాహాబాహికి సిద్దమయ్యారు. ఈ తతంగాన్ని శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ సెల్ ఫోన్లో వీడియో తీయసాగాడు. ఇది చూసిన ఎంపీ అనుచరులు అతడి వద్దనుండి పోన్ లాక్కోవడమే కాదు దాడికి తెగబడ్డారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ లోని ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేసారు.
అయితే పోలీస్ స్టేషన్ నుండి వాళ్లు వెళుతుండగా తన సెల్ పోన్ తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్ అడిగాడు. దీంతో మరోసారి అతడిని కిందపడేసి మరీ దాడికి దిగారు ఎంపీ అనుచరులు. తమ కళ్లముందే ఓ కానిస్టేబుల్ పై దాడిచేస్తున్నా మిగతా సిబ్బంది అడ్డుకోలేకపొయారు. పోలీస్ స్టేషన్ పై దాడి జరిగినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వుండిపోయారు.
ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద ఇంత హల్ చల్ చేస్తే పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఘటన గురించి ఇప్పటికే మీడియాకు, ప్రజలకు తెలియడంతో పోలీసుల్లో కాస్త కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా పోలీసులకు రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం చేసి పోలీసులకు దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.