
కడప : మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకుంది.
ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సిబిఐ అరెస్టులను ప్రారంభించడం అవినాష్, భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా పులివెందులోని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లకు సిబిఐ అధికారులు చేరుకోవడంతో అలజడి మొదలయ్యింది. అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతుండగా తాజాగా సిబిఐ అధికారులు అవినాష్ ఇంటికి చేరుకోవడంతో ఏదో జరగబోతోందని అందరూ భావించారు. చివరకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబంతో వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగా విబేధాల నేపథ్యంలో సొంత బాబాయ్ వివేక్ ను అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా వివేకా హత్యకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం వున్నట్లు అనుమానాల నేపథ్యంలో వివేకా కూతురు సిబిఐ విచారణను కోరారు. దీంతో ఏపీ పోలీసుల చేతినుండి ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లడంతో ఏపీలో అలజడి మొదలయ్యింది.
తాజాగా సిబిఐ విచారణ వేగాన్ని పెంచడంతో పరిణామాలన్నీ మారిపోతున్నాయి. ఇప్పటికే వివేకాను హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని పలుమార్లు సిబిఐ విచారించింది. అంతేకాదు సాంకేతికత ఆధారంగా వివేకా హత్య సమయంలో అవినాష్, భాస్కర్ రెడ్డితో ఎవరెవరు వున్నారో గుర్తించింది. గూగుల్ టేకౌట్ ద్వారా వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో దేవినేని శివశంకర్ రెడ్డి, ఉధయ్ కుమార్ రెడ్డి వున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఉదయ్ కుమార్ కు కూడా వివేకా హత్యతో సంబంధాలున్నాయని అనుమానిస్తూ సిబిఐ అరెస్ట్ చేసింది.
ఇలా వివేకా హత్యకేసులో అరెస్టులు కొనసాగుతున్న సమయంలో సిబిఐ అధికారులు పులివెందులకు చేరుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో వుండటంతో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇప్పటికే అవినాష్ సన్నిహితుడు ఉదయ్ కుమార్ ను గత శుక్రవారమే కడపలో అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
వివేకా హత్య జరిగిన తర్వాత అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ కుమార్ కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఆయనను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుందని భావించింది. ముఖ్యంగా అవినాష్, భాస్కర్ రెడ్డి పాత్రలపై విచారించిన అధికారులు తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.