మేము సత్యవంతులమని చెప్పడం లేదు.. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Sumanth KanukulaFirst Published Jan 30, 2023, 10:02 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. 

వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. అవినీతి అనేది కొత్త కాదని.. తాము సత్యవంతులమని చెప్పడం లేదని అన్నారు. అయితే ప్రతాప్‌కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని వైసీపీ కార్యాలయంలో ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు కొత్తకాదని, గతంలో టీడీపీ హయాంలోనూ ఇప్పటి కంటే ఎక్కువ ఆరోపణలు వచ్చాయని అన్నారు. 

అవినీతి అంతమొందిస్తామని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెబుతారని అన్నారు. అయితే దానిని ఎంతవరకు అమలు చేస్తున్నారన్నదే ముఖ్యమని చెప్పారు. అవసరాల కోసం కొందరు అనధికారికంగా గ్రావెల్ తవ్వుకుంటున్నారని అన్నారు. తాము రూ. 25 కోట్లు అవినీతికి పాల్పడ్డామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. 

అప్పట్లో బీద రవిచంద్ర రూ. 400 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయనతోపాటు టీడీపీ నేత మాలేపాటి సుబ్బారాయుడు గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని.. ఇకపై అలాంటి వాటికి తావులేకుండా చూస్తామని అన్నారు.
 

click me!