హెరిటేజ్, లింగమనేని, నారాయణల కోసం చంద్రబాబు ‘‘ఇన్నర్’’ ప్లాన్ మార్చారు : పేర్ని నాని

Siva Kodati |  
Published : Sep 27, 2023, 02:38 PM IST
హెరిటేజ్, లింగమనేని, నారాయణల కోసం చంద్రబాబు ‘‘ఇన్నర్’’ ప్లాన్ మార్చారు : పేర్ని నాని

సారాంశం

రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారని ఆరోపించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.  హెరిటేజ్, లింగమనేని ఇల్లు, నారాయణ కాలేజీల కోసం చంద్రబాబు  ఇన్నర్ రింగ్ రోడ్  ప్లాన్‌ను మార్చారని ఆరోపించారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జీవో 41 విడుదల చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. 

రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారని ఆరోపించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. హెరిటేజ్, లింగమనేని ఇల్లు, నారాయణ కాలేజీల కోసం చంద్రబాబు ప్లాన్‌ను మార్చారని ఆరోపించారు. దొంగలు రెక్కీ చేసినట్లుగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేశారని పేర్ని నాని దుయ్యబట్టారు. హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్‌గా వున్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని లోకేష్ నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేష్ వున్నారని పేర్ని నాని తెలిపారు. 

ఏ 14గా వున్న లోకేష్ ఐఆర్ఆర్‌తో నాకేం సంబంధం అంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడి యువతను రెచ్చగొట్టి ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. కేసులు ఎక్కువగా వున్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ అని పేర్ని నాని చురకలంటించారు. రూ.371 కోట్లకు ఇంత రాద్దాంతం దేనికని భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రూ.371 కోట్లు టిప్పే అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. 

ఇన్నర్ రింగ్ రోడ్‌ను అటు ఇటు తిప్పినందుకు పాల కంపెనీకి  5 ఎకరాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దేశభక్తితోనే నా ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని రమేష్ హైకోర్టులో చెప్పారని నాని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి కథల్లో ఇది కూడా ఒకటని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారని.. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారని ఆయన ఫైర్ అయ్యారు. లింగమనేని రమేశ్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేలా ప్లాన్ మార్చారని పేర్ని నాని ఆరోపించారు. 

సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేని రమేష్‌కు రూ.27 లక్షలు అద్దె చెల్లించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూములని గవర్నమెంట్ లాక్కుంటుందని భయపెట్టారని నాని తెలిపారు. రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు చెప్పవన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పుకోనివారిని ఏ 2, ఏ 14 బెదిరించారని పేర్ని నాని ఆరోపించారు. రాజధాని ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు తుక్కలో తొక్కారని.. ఎకరం భూమిని రెండు నుంచి 5 లక్షలకే రాయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. 

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రాజధాని ఏర్పాటుకు జీవో ఇచ్చారని పేర్నినాని గుర్తుచేశారు. చంద్రబాబు, నారాయణ దళితులు పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కొన్నారని పేర్నినాని ఆరోపించారు. చట్టం ప్రకారం అసైన్డ్ భూములు లాక్కోవడం సాధ్యం కాదని చెప్పినా వినలేదని ఆయన ఎద్దేవా చేశారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జీవో 41 విడుదల చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Davos Tour: దావోస్‌ పర్యటనలో చంద్రబాబు పవర్ ఫుల్ ఇంటర్వ్యూ | Asianet Telugu
Anitha Praises Woman Constable: జన్నాల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచావ్ తల్లి | Asianet News Telugu