మేం మఠాలకు ఎకరాలు రాసివ్వలేదు.. కానీ: టీడీపీ నేతలకు మల్లాది కౌంటర్

By Siva KodatiFirst Published Nov 15, 2020, 6:35 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్యెల్యే మల్లాది విష్ణు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మఠాలు, స్వామిజీలను  ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు

తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్యెల్యే మల్లాది విష్ణు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మఠాలు, స్వామిజీలను  ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు.

సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని.. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మల్లాది ఆరోపించారు.

2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చిందని... ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసిందని విష్ణు గుర్తుచేశారు.

మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోందని మల్లాది ధ్వజమెత్తారు. 

మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాదేనన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుందని మల్లాది ప్రశ్నించారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలదని ఆయన గుర్తుచేశారు.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారని.. గతంలో యనమల .. స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా అని మల్లాది విష్ణు నిలదీశారు.

అప్పట్లో శారదా పీఠం వెళ్లిన సుజనా చౌదరి, మురళీ మోహన్‌ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా అని మల్లాది ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 

స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదని, వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదని మల్లాది హితవు పలికారు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించిందని..ఆయన ప్రెస్ నోట్‌లకే పరిమితమయ్యారని విష్ణు అన్నారు.

తెలంగాణాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చిందని, కానీ మేం అలా రాసి ఇవ్వలేదని మల్లాది గుర్తుచేశారు. తమ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోందని.. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారని చెప్పారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టమన్నారు. 

click me!