లోకేష్ సిగ్నేచర్ లేని ఔట్ డేటెడ్ చెక్, చంద్రబాబు సంస్కార హీనుడు: ప్రభుత్వ చీఫ్ విప్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Oct 22, 2019, 1:19 PM IST
Highlights

 లోకేష్ ఒక మాలోకం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సిగ్నేచర్ లేని, ఔట్‌డేటెడ్‌ చెక్ లాంటి వాడు నారా లోకేష్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పుకొచ్చారు. 

తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ప్రభుత్వం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

5కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన సీఎం జగన్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే మెదడులో ఉండే చిప్‌ డిస్‌లొకేట్‌ అయినట్లు కనిపిస్తుందంటూ సెటైర్లు వేశారు. 

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సంసార జీవితం గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబు వియ్యంకుడు అయిన ఎమ్మెల్యే బాలకృష్ణతో మోదీ తల్లిని తిట్టించి ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా ఆయనతో కాళ్ళ బేరానికి వెళ్తున్నాడంటూ విమర్శించారు. 

కేసులకు భయపడి టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన చంద్రబాబు పులివెందుల పంచాయితీలు, రాయలసీమ గుండాలు అంటూ రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతిసేలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు రాయలసీమ మహిళలు వాతలు పెట్టె రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాంత్ రెడ్డి. లోకేష్ ఒక మాలోకం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సిగ్నేచర్ లేని, ఔట్‌డేటెడ్‌ చెక్ లాంటి వాడు నారా లోకేష్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పుకొచ్చారు. 

తన కుమారుడిని తలుచుకుంటూ బాధతో చంద్రబాబు సీఎం జగన్‌పై పడిపడి ఏడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వందల కోట్లు ప్రజధనాన్ని తినేసి కొవ్వు పట్టిన దేవినేని ఉమా కూడా సీఎం గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

రివర్స్ టెండరింగ్‌లో ఆదా అయిన రూ. వెయ్యి కోట్ల ప్రజాధనం దేవినేని ఉమాకు కనిపించడం లేదా అని శ్రీకాంత్‌ రెడ్డి నిలదీశారు. చంద్రబాబుకు పని లేదు కాబట్టే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. 

చంద్రబాబుకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వాలే తప్ప గందరగోళం సృష్టించొద్దన్నారు. డీజీపీని పట్టుకొని ఖబర్దార్‌ అని హెచ్చరించడం సరికాదన్నారు. పోలీసులను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడటం పద్ధతికాదన్నారు. 

ఇకనైనా చంద్రబాబు భాష మార్చుకోకపోతే ప్రజలు మరింత అసహ్యించుకుంటారని చెప్పుకొచ్చారు. రాష్ట్రప్రయోజనాల కోసం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తే ఎల్లో మీడియా దానికి వక్రభాష్యం అల్లుతుందన్నారు.  

సీఎం జగన్ చంద్రబాబులా భయపడే వ్యక్తి కాదన్నారు. చంద్రబాబు లా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడం జగన్‌కు తెలియదన్నారు. లోపల ఒకటి జరిగితే బయట ఇంకొకటి చెప్పుకోవడం జగన్‌కు అలవాటు లేదంటూ చురకలంటించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. 
 

click me!