జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్, పవన్ గురించి మీడియాతో గురువారం మధ్యాహ్నం మాట్లాడుతూ, ఆయనది రెండు మూడు రోజుల హడావుడే అని తేల్చేశారు. పోలవరంకు వైయస్సార్సీపీ ఎంఎల్ ఏలు, ఎంపీలు వెళుతున్నారని తెలిసే పవన్ కూడా అక్కడికి వెళ్ళారు తప్ప ఆయనకు విషయం లేదని ఎద్దేవా చేశారు. రెండు మూడు రోజుల హడావుడి తప్ప ఏమీ ఉండదని కూడా జగన్ లైట్ గా తీసుకున్నారు.
వైయస్సార్ హయాంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించిన పవన్ కల్యాణ్ దాన్ని నిరూపించగలరా అంటూ సవాలు విసిరారు. కాంగ్రెస్ది అవినీతి పార్టీ అయితే అందులో పీఆర్పీని సోదరుడు చిరంజీవి ఎందుకు విలీనం చేశారని నిలదీశారు. ఇక పదవులు అందుకోవటానికి అనుభవం ముఖ్యమన్న పవన్ మాటపై స్పందిస్తూ, ఏం అనుభవం ఉన్నదని ఎన్నికలకు ఆరునెలల ముందు పవన్, చిరంజీవి పీఆర్పీని ప్రారంభించారని నిలదీసారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను పవన్ ఇపుడు ప్రస్తావించారని కానీ తమ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజ్యసభలో గతంలోనే ప్రస్తావించారని జగన్ స్పష్టం చేశారు.