ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి శుక్రవారం రాత్రి మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు.
గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యుడు. పేదల డాక్టరుగా ఆయనకు పేరుంది. గంగిరెడ్డి 2001 - 2005 మధ్య కాలంలో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు
2003లో రైతులకు రబీ వితనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టర్ కార్యాలయం వరకు గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. గంగిరెడ్డిని పరామర్శించడానికి ఇటీవల వైఎస్ జగన్ హైదరాబాదు వచ్చిన విషయం తెలిసిందే.
తిరుమల నుంచి వైఎస్ జగన్ నేరుగా హైదరాబాదు వచ్చి గంగిరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్యం విషమించడంతో గంగిరెడ్డి మరణించారు.ఆయన అంత్యక్రియలో శనివారం పులివెందులలో జరుగుతాయి. వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు పులివెందుల చేరుకుంటారు. వైఎస్ విజయమ్మ తాడెేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు.