జగన్ పై అలకవీడిన బాబాయ్ వైవీ: వైసిపిలో జోష్

By Nagaraju penumalaFirst Published May 8, 2019, 5:31 PM IST
Highlights

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి చెవిలో వేశారట వైసీపీ నేతలు. దీంతో దిగొచ్చిన బాబాయ్ బుధవారం నుంచి పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ అయ్యారట. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకవీడారు. ఒంగోలు టికెట్ దక్కకపోవడం, తన రాజకీయ శత్రువు, బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి అలకపాన్పు ఎక్కారు. 

ఎన్నికల ముందు నుంచి అలకపాన్పు ఎక్కిన ఆయన ఎన్నికల్లో స్తబ్ధుగా ఉన్నారు. అటు పార్టీ కార్యకలాపాల్లో కానీ అంతగా పాల్గొనలేదు. పోనీ ఎన్నికల అనంతరం అలకవీడతారా అనుకున్నా అయినా వీడలేదు. 

అయితే వైవీ సుబ్బారెడ్డి అలక వీడేలా చెయ్యాలని వైఎస్ జగన్ పై ఒత్తిడి పెంచారట పార్టీ కీలక నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యహరించిన వైవీ సుబ్బారెడ్డి అలా స్తబ్ధుగా ఉంటే పార్టీకే నష్టమని జగన్ కు చెప్పుకొచ్చారట. 

టికెట్ ఇవ్వకపోయినా నామినేటెడ్ పదవుల్లో కీలక పదవి ఇవ్వాలని, వైవీని దూరం చేసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని పలువురు జగన్ కు సూచించారట. దీంతో దిగొచ్చిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారట. 

అంతేకాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి చెవిలో వేశారట వైసీపీ నేతలు. దీంతో దిగొచ్చిన బాబాయ్ బుధవారం నుంచి పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ అయ్యారట. 

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారట. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి ఫోన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారట. 

వైవీ సుబ్బారెడ్డి తెరపైకి రావడంతో ఇక పార్టీలోనూ కార్యకర్తల్లోనూ మాంచి జోష్ వచ్చిందట. ఇకపోతే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇంచార్జ్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి ఆ జిల్లా వాసులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లా వాసులు వైవీ లైన్లోకి రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారట. 

click me!