పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్

By telugu teamFirst Published Apr 9, 2021, 8:02 AM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రంగ్ దే సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రీమియర్ షోలు ఆడకుండా చర్యలు తీసుకుంది. గతంలో కొత్త సినిమాల ప్రీమియర్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వకీల్ సాబ్ సినిమాపై ఏ విధమైన ఆదేశాలు ఇవ్వకుండానే బ్రేకులు వేసింది. గతంలో కొత్త సినిమాలకు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉండేది. 

వకీల్ సాబ్ సినిమాకు కూడా అటువంటి వెసులుబాటు ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంత మంది ఈ నెల 7వ తేదీన ప్రీమియర్ షో టికెట్లు విక్రయించారు కూడా. అయితే, ప్రీమియర్ షోలను అధికారులు అడ్డుకున్నారు. గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఇచ్చిన ప్రకటన వకీల్ సాబ్ పాలిట శాపంగా మారింది. 

వకీల్ సాబ్ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపును అనుమతించేది లేదని ఆమె చెప్పారు. ఒకవేళ అధిక ధరలకు టికెట్లు విక్రయించినా, ప్రీమియర్ షోలు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

దానిపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విజయవాడలోని ఓ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు నితిన్ సినిమా రంగ్ దేకు ధరల పెంపును అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం వకీల్ సాబ్ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు 

వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యనే అని పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే, కరోనా కారణంగా బెనిపిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతించకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులు కొంత మంది హైదరాబాద్ వచ్చి సినిమా చూశారు.

click me!