చంద్రబాబుకు వైఎస్ జగన్ షాక్: గత ప్రభుత్వ అక్రమాలపై సిట్

By telugu teamFirst Published Feb 21, 2020, 10:16 PM IST
Highlights

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేసి, విచారణ జరిపి, చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సీట్ ను ఏర్పాటు చేశారు. సిట్ కు కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వం వహిస్తారు.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగు ముందుకేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ను) ఏర్పాటు చేశారు. 

సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో పది మంది సభ్యులతో ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు మొదలు విచారణ, చార్జిషీట్ వరకు అధికారాలు కట్టబెడుతూ ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. 

మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలపై దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేసేందుకు ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సీఆర్డీఎ పరిధిలో జరిగిన అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. అమరావతి విషయంలోనే కాకుండా ఇతర ప్రాజెక్టులపై కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సాక్షులను విచారించడంతో పాటు చార్జిషీట్ కూడా సిట్ దాఖలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు పలువురు చిక్కులను ఎదుర్కునే అవకాశం ఉంది. 

అమరావతిలో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. పలువురు బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీలను ఏర్పాటు చేసుకుని వారు భూములను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

click me!