చంద్రబాబు పాలనలో అంతా రివర్స్ గేర్: వైఎస్ జగన్ ధ్వజం

Published : Oct 01, 2018, 06:12 PM IST
చంద్రబాబు పాలనలో అంతా రివర్స్ గేర్: వైఎస్ జగన్ ధ్వజం

సారాంశం

సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ మూడులాంతర్ల జంక్షన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగెడితే చంద్రబాబు నాయుడు హయాంలో రివర్స్ గేర్ లో నడుస్తోందని ఆరోపించారు. 

విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ మూడులాంతర్ల జంక్షన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగెడితే చంద్రబాబు నాయుడు హయాంలో రివర్స్ గేర్ లో నడుస్తోందని ఆరోపించారు. 

తోటపల్లి ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 90శాతం పనులు పూర్తి చేసుకుందని జగన్ తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో10శాతం పనులను కమీషన్లకు కక్కుర్తి పడి పూర్తి చెయ్యలేకపోయారన్నారు. షట్టర్లు ఎత్తి తానే పూర్తి చేశానని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అలాగే పెద్దగడ్డ రిజర్వాయర్ ద్వారా నీరందించిన ఘనత వైఎస్ఆర్ దేనని జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో సహకార రంగంలో ఉన్నఫ్యాక్టరీలు మూసివేయబడతాయన్నారు. విజయనగరం జిల్లాలో జ్యూట్ మిల్లులు మూసివేతే అందుకు నిదర్శనమన్నారు. సహకార రంగంలో ఉన్న భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ రూ.35కోట్ల నష్టంతో మూసివేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 35 కోట్లు నష్టాన్ని భర్తీ చేసి ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాట పట్టించారని గుర్తు చేశారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు కాలంలో మళ్లీ భీమిసింగి షుగర్ ఫ్యాక్టరీ 48 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు.  

మరోవైపు విజయనగరం జిల్లాలో 86 మంది విషజ్వరాలతో చనిపోతే పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. దోమలపై దండయాత్ర అంటున్న చంద్రబాబు నాయుడు ఈ మరణాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

జిల్లా వ్యాప్తంగా 27 అంబులెన్స్ లు ఉంటే వాటిలో కేవలం 17 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. అంటే కనీసం మండలానికి కూడా ఒక్కో అంబులెన్స్ లేదని దుస్థితిలో ఉన్నామన్నారు. 108 సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేకపోవడం వల్ల అవికూడా సక్రమంగా నడిచేపరిస్థితి లేదన్నారు.  

నేటికి వేసవి కాలం వస్తే విజయనగం జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉందని జగన్ ఆరోపించారు. విజయనగర పట్టణ వాసుల దాహర్తిని తీర్చేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టును 2007లో ప్రారంభించారన్నారు. రూ.220 కోట్లతో పనులు ప్రారంభిస్తే 30శాతం పనులు ఆనాడే పూర్తయ్యాయని కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడిపోయిందన్నారు. 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకువస్తాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు పేద రైతులను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం చుట్టూ చంద్రబాబు బినామీల భూములే ఉన్నాయని కానీ చంద్రబాబు వాటి జోలికి వెళ్లలేదన్నారు. 

అమాయక రైతుల భూములను లాక్కొన్నారని దుయ్యబుట్టారు. ఆఖరికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రభుత్వ సంస్థకు దక్కకుండా  కుట్రపన్నారని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Visits Juvvaladinne: జువ్వలదిన్నె పర్యటనలో జగన్ కోసం ఫ్యాన్స్ పరుగులు| Asianet News Telugu
YS Jagan Visits Juvvaladinne: మత్స్య కారుల సమస్యలు విని జగన్ రియాక్షన్ చూడండి| Asianet News Telugu