చంద్రబాబునాయుడుని కించపరుస్తూ, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఓ వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని కించపరుస్తూ, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఓ వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసే క్రమంలో చంద్రబాబు ఈ నెల 8వ తేదీన బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే.
కాగా.. ఆ సమయంలో చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ.. టీడీపీ నేతలు కొందరు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. వాటిపై ‘‘ సింబల్ ఆఫ్ యూనిటి, యూ ఆర్ ది హోప్’’ అంటూ ఇంగ్లీష్ లో కొటేషన్స్ రాశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటోలను ఓ యువకుడు మార్ఫింగ్ చేశాడు.
యు ఆర్ ది హోప్ వుయ్ రెలి ఆన్ అనే పదాన్ని వుయ్ ఫీల్ అషేమ్డ్గా మార్చారు. అంతేకాక బెంగళూరు తెలుగుదేశం ఫోరం నుంచి ‘చంద్రబాబుకు ఘోర అవమానం’ అంటూ మార్ఫింగ్ చేసిన ఆయా ఇంగ్లీషు కొటేషన్ల ప్లకార్డులతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారు. వాటిని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కుమార్ రాజు అనే యువకుడు వాటిని ఫేస్ బుక్, వాట్సాప్ లలో షేర్ చేశాడు. వాటిని చూసిన టీడీపీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా.. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన అడ్మిన్ ని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరికొందరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.