ఢిల్లీపై బిల్లు విషయంలోనూ ఎన్డీఏకు వైసీపీ సపోర్ట్.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామని ప్రకటించిన విజయ సాయిరెడ్డి

Published : Jul 27, 2023, 12:19 PM IST
ఢిల్లీపై బిల్లు విషయంలోనూ ఎన్డీఏకు వైసీపీ సపోర్ట్.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామని ప్రకటించిన విజయ సాయిరెడ్డి

సారాంశం

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచిన వైసీపీ.. ఇప్పుడు మరో విషయంలోనూ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. వివాదాస్పద ఢిల్లీ నియంత్రణ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. 

ఢిల్లీలో సేవలపై పట్టు సాధించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లుకు రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదానికి వైసీపీకి చెందిన ఈ తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఎన్డీఏకు కలిసిరానుంది. కాగా.. విపక్షాల కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా వైసీపీ వ్యతిరేకంగా నిలిచింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు, ఢిల్లీ బిల్లుకు ఆమోదం పొందేందుకు తాము అనుకూలంగా ఓటేస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. 

కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023కు లోక్ సభలో సునాయాసంగా ఆమోదం పొందనుంది. ఎందుకంటే బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఎగువ సభలో అవసరమైన దాని కంటే ఎక్కువ సంఖ్యలోనే సభ్యులు ఉన్నారు. కానీ రాజ్యసభలో ఎన్డీఏకు అంతగా మెజారిటీ లేదు. అనేక సందర్భాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఈ పెద్దల సభలో ఆమోదం పొందడం సవాలుగా మారింది. 

అయితే ఈ సారి ఎన్డీఏకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో రాజ్యసభలో వివాదాస్పద ఢిల్లీ నియంత్రణ బిల్లు ఆమోదం పొందటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఎంపీలు, వాటి మిత్రపక్షాలైన అన్నాడీఎంకే, ఇతర చిన్న భాగస్వామ్య పక్షాలతో సహా మొత్తంగా ఎన్డీఏకు 123 ఓట్లతో కూడిన మెజారిటీ ఉంది. అయితే వైసీపీతో పాటు తొమ్మిది మంది ఎంపీలున్న ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ ఈ విషయంలో తన వైఖరిని ఇంకా ఖరారు చేయలేదు.

ఢిల్లీ బ్యూరోక్రాట్లపై తన నియంత్రణను చాటుకునేందుకు కేంద్రం గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలపై ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు ఈ ఆర్డినెన్స్ ను కేంద్రం తీసుకొచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం లభిస్తే.. ఈ చట్టం దేశ రాజధానిలో పాలనా గమనాన్ని మార్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations