చంద్రబాబు, లోకేష్ ను కూడా వదిలిపెట్టబోం: ఎమ్మెల్యే అమర్నాథ్ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Feb 2, 2021, 4:20 PM IST
Highlights

నామినేషన్ వేయడానికి సిద్దమైన వైసిపి మద్దతుదారుడ్ని అడ్డుకుని అతనిపై దౌర్జన్యం చేసి దాడులకు తెగబడితేనే పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేస్తే అదేదో నేరం-ఘోరం అన్నట్టుగా చంద్రబాబు, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఆ పార్టీ రెండు నాల్కల వ్యవహరాన్ని బట్టబయలు చేస్తోందన్నారు అమర్నాథ్. 

పంచాయితీ ఎన్నికల సందర్భంగా తన సొంతూరు నిమ్మాడలో బలవంతపు ఏకగ్రావానికి  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రయత్నించాడని... ఇందుకు వ్యతిరేకంగా వైసిపి మద్దతులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్దమైన అభ్యర్థిని బెదిరించారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా నామినేషన్ వేయడానికి సిద్దమైన వైసిపి మద్దతుదారుడ్ని అడ్డుకుంటే, అతనిపై దౌర్జన్యం చేసి దాడులకు తెగబడితేనే పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. అయితే అదేదో నేరం-ఘోరం అన్నట్టుగా చంద్రబాబు, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఆ పార్టీ రెండు నాల్కల వ్యవహరాన్ని బట్టబయలు చేస్తోందన్నారు అమర్నాథ్. 

''ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ..  అచ్చెన్నాయుడు రెడ్ హ్యాండెడ్ గా ఆడియోల్లో, వీడియోల్లో దొరికితే.. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు అన్యాయం, అక్రమం అంటారా..? అంటే మీరు ఎటువంటి ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు..?'' అని ప్రశ్నించారు. 

''వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ ప్రజల్ని రెచ్చగొట్టి,  దౌర్జన్యాలకు దిగినా, బెదిరింపులకు పాల్పడినా.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.  ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా.. ఎవరు దౌర్జన్యాలు చేసినా, అది చంద్రబాబు అయినా, లోకేష్ అయినా మరొకరు అయినా అధికారులు కచ్చితంగా చర్యలు తీసుకుంటారు, తీసుకోవాలి'' అని సూచించారు. 

read more  పట్టాభిపై హత్యాయత్నం వెనక హస్తం వారిదే: యనమల సంచలనం

''ఖాకీ డ్రస్ చూస్తేనే అసహ్యం వేస్తుందంటూ అచ్చెన్నాయుడు మొత్తం పోలీసు శాఖనే అగౌరవపరిచాడు. ఖాకీ డ్రస్సులు చూస్తే.. అసహ్యం వేస్తుందని మాట్లాడుతున్న మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు పోలీసులను ఎందుకు సెక్యూరిటీగా పెట్టుకున్నాడు..? ఆయన సెక్యూరిటీని వెనక్కు పంపించమని చెప్పండి. టీడీపీ అధికారంలోకి వస్తుంది, తాను హోం మంత్రిని అవుతాను అని అచ్చెన్నాయుడు ఇప్పటి నుంచే పగటి కలలు కంటూ.. పోలీసు అధికారుల్ని బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి రావటం అన్నది ఎప్పటికీ పగటి కలే అన్నది గుర్తు పెట్టుకోవాలి'' అంటూ ఎద్దేవా చేశారు. 

''టీడీపీ చెప్పినట్లు ఎన్నికల కమిషన్ ప్రవర్తించడం సమంజసం కాదు. అచ్చెన్నాయుడుపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించటం లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాస్తా.. తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ గా మారిపోయింది. పోలీసులను అగౌరవపరుస్తూ, వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నాను'' అని అమర్నాథ్ అన్నారు. 


 

click me!