ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేకి సోకినా కరోనా వైరస్

By Sreeharsha GopaganiFirst Published Jun 23, 2020, 7:07 AM IST
Highlights

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యులపై కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యుల్లో తొలి కరోనా కేసు నమోదయింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కడుబంతి శ్రీనివాస్ కరోనా వైరస్ బారినపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిననాటి నుండి కేసులు మరింతగా ఉదృతమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యులపై కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. 

ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యుల్లో తొలి కరోనా కేసు నమోదయింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కడుబంతి శ్రీనివాస్ కరోనా వైరస్ బారినపడ్డారు. 

ఈ మధ్యే అమెరికా నుండి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు మార్గదర్శకాల ప్రకారం మూడు సార్లు కరోనా పరీక్షలు చేపించుకున్నారు. మొదటి రెండు టెస్టులు నెగటివ్ రాగా.... విజయనగరం ప్రభుత్వాసుపత్రి పరిధిలో చేపించుకున్న మూడవ టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. 

ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో... ఆయన సిబ్బంది, కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలయింది. తాను అమెరికా నుండి వచ్చినప్పటి నుండి కఠినంగా కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తున్నానని, అందరికి దూరంగానే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. 

శ్రీనివాస్ కు కరోనా వైరస్ సోకడంతో ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యనాయకులు అంతా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానని ఎమ్మెల్యే అన్నాడు. 

సోమవారం కొత్తగా 21 కేసులు నమోదవడంతో....  విజయనగరం జిల్లా పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 141 కి చేరుకుంది. పక్కనున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణాలో కూడా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకినా విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కి కూడా కరోనా సోకింది. 

ఇక తెలంగాణాలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ ఒక్క రోజే 872 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 8,674కి చేరింది. సోమవారం వైరస్ కారణంగా సోమవారం ఏడుగురు మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 217కి చేరుకుంది.

రాష్ట్రంలో 4,452 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 4,005 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్క హైదరాబాద్‌లోనే 713 మంది కోవిడ్ 19 బారినపడ్డారు.

ఆ తర్వాత రంగారెడ్డి 107, మేడ్చల్ 16, మంచిర్యాల 5, సంగారెడ్డి 12, వరంగల్ అర్బన్ 1, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్‌లలో రెండేసి చొప్పున, కామారెడ్డి, మెదక్‌లలో మూడేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. 

కరోనాతో కాలాపత్తర్‌లో ఎఎస్ఐగా పనిచేస్తున్న ఎఎస్ఐ యూసుఫ్ మరణించాడు. వారం రోజుల క్రితమే ఆయన కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. పోలీసు శాఖలో కరోనాతో మరణించినవారి సంఖ్య మూడుకు చేరుకొంది. తొలుత యాదగిరి రెడ్డి అనే కానిస్టేబుల్ మరణించాడు. ఈ నెల 16వ తేదీన హోంగార్డు కరోనాతో మరణించాడు. ఆయన డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో పనిచేసేవాడు.

click me!