
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం కావడంతో వైసీపీ నేత పార్థసారథి సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. విజయవాడలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఆయన అనుచరుల కన్ను ఆర్టీసీపై పడిందని అందుకే దీనిని కబళించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఆర్టీసీనీ బంగారు బాతులా భావించారే గానీ నష్టాల నుంచి గట్టెక్కించేందుకు సీఎం కనీస చర్యలు తీసుకోలేదని పార్థసారథి ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ఏపీఎస్ ఆర్టీసీకి ఈ దుస్థితి దాపురించిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా టాక్స్ భారం మోపి సంస్ధను నష్టాల పాటు చేశారని ఆయన మండిపడ్డారు
పోలవరం, నవ నిర్మాణ దీక్షలకి ఉపయోగించిన ఆర్టీసీ బస్సులకు డబ్బులు చెల్లించారా.. దొంగ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ల ద్వారా ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న విషయం చంద్రబాబుకు తెలీదా అని పార్థసారథి ప్రశ్నించారు.
కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ నిర్ణయించారని ... కార్మికుల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్థసారథి తెలిపారు.