అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలు.. గాయపడినప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించిన విశాఖ మహిళ

By Sumanth KanukulaFirst Published Oct 27, 2022, 4:05 PM IST
Highlights

విశాఖపట్నం జిల్లాలో ఓ వివాహిత కనబరిచిన తెగువ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అర్దరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలను ధైర్యంగా ఎదుర్కొంది. కత్తిపోట్లకు గురైనా భయపడకుండా ప్రతిఘటించింది. 

విశాఖపట్నం జిల్లాలో ఓ వివాహిత కనబరిచిన తెగువ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అర్దరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలను ధైర్యంగా ఎదుర్కొంది. కత్తిపోట్లకు గురైనా భయపడకుండా ప్రతిఘటించింది. పెద్దగా కేకలు వేసి వారు అక్కడి నుంచి పారిపోయేలా చేసింది. వివరాలు.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చీమలపల్లి రామమందిరం సమీపంలోని చెరువుగట్టులో రిటైర్డ్ ఉద్యోగి ఆళ్ల అప్పారావు కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు భార్య లలిత కుమారి, కుమారులు వినయ్ కుమార్, అవినాష్ కుమార్ ఉన్నారు. 

అవినాష్‌కు ఇటీవలే లావణ్యతో వివాహం జరిగింది. మంగళవారం రాత్రి అవినాష్ నైట్ డ్యూటీకి వెళ్లారు. లావణ్య ఓ గదిలో ఒంటరిగా నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిటికీ గ్రిల్‌ తీసి ఇంట్లోకి చొరబడ్డారు. లావణ్య ఉన్న గది తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి యత్నించారు. అయితే ఆ శబ్దానికి నిద్రలేచిన లావణ్య.. దొంగలను తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు పెద్దగా కేకలు వేశారు. ఈ క్రమంలోనే దొంగలు ఆమెపై కత్తితో దాడి చేశారు. అయినప్పటికీ లావణ్య భయకుండా వారిని ఎదుర్కొంది. చివరకు అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. 

లావణ్య పెద్దగా కేకలు వేయడంతో చుట్టపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే లావణ్య కేకలు వేసిన సమయంలో ఆమె కుటుంబ సభ్యులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన దొంగలు వారి గదులకు గడియ పెట్టడంతో వీలు లేకుండా పోయింది. అయితే తర్వాత బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు.. లావణ్యను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అవినాష్ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా చెప్పారు. 

click me!