
నిత్యం మద్యం తాగుతున్న భర్త లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించింది ఓ భార్య. ఆ ప్రయత్నం బెడిసికొట్టి ఆమె మృత్యువాతపడింది. తాగుడు మానకపోతే సూపర్ వాస్మోల్ 33 తాగి చచ్చిపోతానని భయపెట్టాలని చూసింది. అయితే ఆమె ప్రయత్నం వికటించింది. దీంతో ఆమె ప్రాణాలు పోయాయి.
ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం నర్సింగిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకోగా.. తోపల గారాలమ్మ (52) మృత్యువు ఒడిలోకి చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
గారాలమ్మ భర్త అప్పన్న నిత్యం మద్యం తాగి వచ్చి ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో భర్తతో మద్యం మాన్పించాలనే ఉద్దేశంతో అతని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న సూపర్ వాస్మోల్ 33ను గారాలమ్మ తాగింది.
దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు రెఫర్ చేశారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గారాలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు.