ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి, మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టించి.. ఓ భార్య ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Sep 23, 2022, 8:54 AM IST
Highlights

అక్రమసంబంధం మోజులో కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా కాటికి పంపిందో భార్య. ఆ తరువాత ఏమీ తెలియనట్టు భర్త కనిపించడం లేదంటూ కంప్లైంట్ చేసింది. ఐదు నెలల తరువాత అరెస్టయ్యింది. 

శ్రీకాకుళం జిల్లా : వివాహేతర సంబంధం మోజులో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి పథకం వేసింది. ప్రియుడు అతని స్నేహితులు కలిసి ఆమె భర్తను చంపి, తగులబెట్టేశారు. ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత మృతుడి సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు గురువారం కుట్రను చేధించారు. నిందితులను ఆముదాలవలస కోర్టులో హాజరుపరిచారు.  కొత్తూరు సీఐ ఆర్. వేణుగోపాలరావు, హిరమండలం ఎస్సై జి. నారాయణస్వామి విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం..  విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కుంబిరిక రాజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని చిన్నకొల్లివలసలో కొన్నేళ్ళ కిందట స్థిరపడ్డాడు. 

హిరమండలానికి చెందిన సుజాతతో పదేళ్ల కిందట అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా హైదరాబాదులో కూలిపనులు చేస్తున్న రాజు ఈ ఏడాది ఏప్రిల్ 4న హీరమండలంలోని భార్య వద్దకు వచ్చాడు.  అప్పటికే అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సుజాత, రాము.. ఎల్లంపేట మండలం ధరణికోటకు చెందిన రాము స్నేహితుడు కె నూకరాజుతో కలిసి పథకం వేశారు. ఏప్రిల్ 6న రాము, నూకరాజు..  రాజుతో కలిసి వంశధార నది పక్కన మద్యం తాగారు. రాజు అపస్మారక స్థితిలోకి వెళ్ళాక ఆటోలో ఎక్కించుకుని ఎల్ఎన్ పేట సరిహద్దులో ఉన్న వంశధార కుడి ప్రధాన కాలువగట్టుపైకి తీసుకు వెళ్లారు. ఆటో ఇంజిన్ స్టార్ట్ చేసే తాడును అతని మెడకు బిగించి హత్య చేశారు.  మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశారు. 

ప్రకాశంలో దారుణం.. నడిరోడ్డుపై లారీతో ఢీకొట్టి వైసీపీ నాయకుడి హత్య..

పెట్రోల్ పోసి తగలబెట్టేయాలని…
ఈ విషయం సుజాతకు చెప్పడంతో.. మృతదేహం ఉంటే ఎవరైనా గుర్తు పడుతారని పెట్రోల్ పోసి తగలబెట్టాలని సుజాత సూచించింది. దీంతో వారిద్దరూ ఏప్రిల్ 7న రాత్రి మృతదేహం వద్దకు వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అదే సమయంలో వర్షం కురవడంతో మృతదేహం పూర్తిగా కాలలేదని, కాలువలోకి తోసేశారు. కొద్దిరోజుల తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సుజాత తన భర్త కనిపించడం లేదంటూ ఏప్రిల్ 22న హిరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను విచారించారు. దీంతో తామే ఈ హత్యకు పాల్పడ్డారని చెబుతూ నిందితులు ముగ్గురూ లొంగిపోయారు.

click me!