కరోనా పాజిటివ్ : భార్యభర్తల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి.. ప్రశ్నిస్తే పాతేస్తామంటూ బెదిరింపులు..

By AN TeluguFirst Published Apr 20, 2021, 1:23 PM IST
Highlights

నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లో కరోనా పాజిటివ్ వచ్చిన భార్యభర్తల మీద అపార్ట్ మెంట్ వాసులు దారుణంగా వ్యవహరించారు.

నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లో కరోనా పాజిటివ్ వచ్చిన భార్యభర్తల మీద అపార్ట్ మెంట్ వాసులు దారుణంగా వ్యవహరించారు. 

కరోనా భయం మనుషుల్ని రాక్షసులుగా మార్చేస్తోంది. మానవత్వాన్ని మరిచిపోయి అత్యంత క్రూరంగా ప్రవర్తించేలా చేస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిపట్ల మానవత్వం చూపించాల్సింది పోయి దయనీయంగా వ్యవహరించారో అపార్ట్ మెంట్ వాసులు.

నెల్లూరులోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్న.. భార్యభర్తలు తాజాగా పాజిటివ్ గా తేలారు. దీంతో వీరు తమ ఇంట్లోనే ఉంటూ తమ కొడుకుతో అవసరమైనవి తెప్పించుకుంటున్నారు.

మంగళవారం ఉదయం లేచి చూసేసరికి తమ ప్లాట్ బైటినుంచి తాళం వేసి ఉంది. ఏమైందో అర్థం కాక.. అపార్ట్మెంట్ వాసులకు ఫోన్ చేసి అడగగా.. వాళ్లు బైటికి వచ్చి తమకు కూడా కరోనాఅంటిస్తారనే భయంతో తాళం వేశామని తెలిపారు.

తమ ఎదురు ప్లాట్ లోని వారే స్వయంగా తాళం వేశారని తెలిసి వారు షాక్ కు గురయ్యారు. వారు ఎంత వేడుకున్నా వారు తాళం తీయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని భార్యభర్తలు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. 

విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఎందుకు ఇలా చేశారంటూ ప్రశ్నించిన మీడియా మీద అపార్ట్ మెంట్ వాసులు దురుసుగా వ్యవహరించారు. అంతేకాదు.. ప్రశ్నించిన వారిని పాతేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

దీంతో పోలీసుల రాక కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. మీడియాతో వాగ్వాదంతో అపార్ట్ మెంట్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

click me!