తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:48 PM (IST) Oct 05
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత రామ్లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ నటుడు ప్రభాస్ హాజరయ్యారు. ఆయనను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
08:48 PM (IST) Oct 05
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో భారత్కు చెందిన మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హా వున్నారు. మొత్తం 343 మంది ఈ అవార్డ్ కోసం పోటీపడుతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. మిగిలిన వారిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పర్యావరణ వేత్త గ్రెటా థన్బర్గ్ తదితరులు వున్నారు.
07:53 PM (IST) Oct 05
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ... కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
07:16 PM (IST) Oct 05
పాకిస్తాన్తో ఎందుకు చర్చలు జరపాలని ప్రశ్నించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అది జరగని పని అని ఆయన స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని అమిత్ షా అన్నారు. గడిచిన కొన్నేళ్లలో జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదం 42 వేల మందిని పొట్టన పెట్టుకుందని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
06:26 PM (IST) Oct 05
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులకు పండగ పూట బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. హాస్పిటల్ను పేల్చేస్తామని, అంబానీ కుటుంబంలోని కొందరిని చంపేస్తామని బెదిరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
05:42 PM (IST) Oct 05
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశించనున్నందున ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటు అనివార్యంగా మారింది. దీంతో ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అద్దె భవనంలో పార్టీ కార్యాలయం కొనసాగనుంది. పార్టీ కార్యాలయానికి సంబంధించి మరమ్మత్తు పనులు చేస్తున్నారు.
05:02 PM (IST) Oct 05
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పేరు మారుస్తూ తీర్మానం చేయడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని విమర్శించారు.
04:14 PM (IST) Oct 05
2022 ఏడాదికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టిన్ మెల్డల్, బ్యారీ షార్ప్లెస్లను ఇందుకు ఎంపిక చేశారు. క్లిక్ కెమెస్ట్రీని అభివృద్ధి చేయడంతో పాటు దానిని ప్రజల దైనందిన జీవితంలో ఉపయోగపడేలా చేసేందుకు గాను వారికి ఈ అవార్డును ప్రకటించారు.
03:30 PM (IST) Oct 05
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఈరోజు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడా కనిపించకపోవడం మాత్రం చర్చనీయాంశమైంది.
02:55 PM (IST) Oct 05
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో బుధవారం భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తవాంగ్లోని ఫార్వర్డ్ ఏరియాల వెంట రొటీన్ మిషన్లో హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 10 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్ లు ఉన్నారు.
01:31 PM (IST) Oct 05
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినట్లు... ఇందుకు పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ లేఖ రాసింది.
01:24 PM (IST) Oct 05
మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటినుండి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ కాగా... కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా పోటీకి సిద్దమైంది. ఈ పార్టీ తరపున ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నట్లు కెఏ పాల్ ప్రకటించారు.
12:51 PM (IST) Oct 05
తెలంగాణలోని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
12:09 PM (IST) Oct 05
జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో తనను హౌస్ అరెస్ట్ చేసారని పిడిపి చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముప్తీ తెలిపారు. నార్త్ కశ్మీర్ లోని పట్టాన్ పట్టణంలో పెళ్లికి హాజరుకావాల్సి వుండగా హౌస్ అరెస్ట్ చేసారని ముప్తీ పేర్కొన్నారు. మాజీ సీఎం హక్కులనే ఇలా హరిస్తున్నారంటే కాశ్మీర్ లో సామాన్యుల పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని ముప్తీ ఆందోళన వ్యక్తం చేసారు.
10:46 AM (IST) Oct 05
దసరా పండగపూట తెలంగాణలో వాడీవేడి రాజకీయాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయ్యింది. టీఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్పుకు సంబంధించిన అధికారిక ప్రకటన మధ్యాహ్నం 1.19 గంటలకు వెలువడనుంది. తెలంగాణ భవన్ తో జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి 283 మంది ప్రతినిధులు హాజరై టీఆర్ఎస్ పేరు మార్పుకు సంబంధించి తీర్మానం చేసి సంతకాల సేకరణ చేపట్టనున్నారు.
10:01 AM (IST) Oct 05
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,468 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,01,934 కు మరణాల సంఖ్య 5,28,733 చేరింది. ప్రస్తుతం కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా వుండటంతో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 33,318 కి చేరింది.
09:27 AM (IST) Oct 05
ఇటీవలే టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన సతీమణి తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఓదేలు దంపతులు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో వీరు మళ్లీ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
09:18 AM (IST) Oct 05
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలోపడి పౌరి జిల్లాలో మారణహోమం సృష్టించింది. ఈ ప్రమాదంలో బస్సులోని 25మంది ప్రాణాలు కోల్పోగా మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ిrr
Read More ఘోర రోడ్డు ప్రమాదం.. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తుండగా.. లోయలో పడ్డ బస్సు.. 25 మంది మృతి