పొంచివున్న మరో తుఫాను ముప్పు... తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

By Arun Kumar PFirst Published May 22, 2021, 10:15 AM IST
Highlights

తూర్పు మధ్య బంగాళాఖాతంలో, దాన్ని ఆనుకున్న ఉత్తర అండమాన్ సముద్రంలో నేడు(శనివారం) అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో, దాన్ని ఆనుకున్న ఉత్తర అండమాన్ సముద్రంలో నేడు(శనివారం) అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఈనెల 24 నాటికి తుపానుగా మారే అవకాశం వుందని... ఈనెల 26న ఈ తుపాను ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఈ అల్పపీడనం కారణంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే దక్షిణాంధ్ర తీరంలో నేటినుంచి ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని... సముద్రం అల్లకల్లోలంగా మారనుందని తెలిపారు. కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదని... ఇప్పటికే చేపల వేటకోసం సముద్రంలో వెళ్లిన మత్స్యకారులు తిరిగిరావాలని వాతావరణ శాఖ సూచించింది. 

read more  టౌటే తుఫాన్ ఎఫెక్ట్: ముంబైని ముంచెత్తిన వానలు, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో జోరు వర్షాలు

ఇదిలావుంటే ఇటీవలే టౌటే తుఫాన్ ప్రభావంతో దేశంలో ఆరు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, పెనుగాలుల ధాటికి ఆయా రాష్ట్రాల్లో 14 మంది మరణించారు. గత సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత  గుజారత్ తీరాన్ని తుఫాన్ తాకింది. 

ముంబై తీర ప్రాంతంలోని అరేబియా సముద్రంలో రెండు నౌకలు తుపాన్ కారణంగా లంగర్లు కొట్టుకొని సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ రెండు నౌకల్లోని 400 మంది సిబ్బందిని నేవీ అధికారుల రక్షించారు. తుఫాన్ కారణంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు మూసివేశారు. 

తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు మరణించారు. రెండు పడవలు మునిగిన ఘటనలో ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది మంది చనిపోయారు.  కేరళ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో తుపాన్ ప్రభావం కన్పించింది. సోమవారం నుండి గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి.వర్షాలు, పెనుగాలులతో సెల్‌టవర్లు, విద్యుత్ స్థంబాలు, చెట్లు విరిగాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలు స్థంభించాయి. 

click me!