అసాంఘిక కార్యకలాపాల్లో భాగమైన రికార్డింగ్ డ్యాన్స్ లను అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులపైనే గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ఓ మత్స్యకార గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల దాడిలో ఎస్సైతో పాటు ఓ హోంగార్డు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాల్లో భాగమైన రికార్డింగ్ డ్యాన్స్ లను అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులపైనే గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ఓ మత్స్యకార గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల దాడిలో ఎస్సైతో పాటు ఓ హోంగార్డు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే... కావలి సమీపంలోని సముద్ర తీరంలోని మత్స్యకార గ్రామమైన కొత్తసత్రం కి చెందిన యువకులు కొందరు ఏటా మంగళూరుకు చేపల వేటకు వెళ్లి వస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇలా చేపల వేటకు వెళ్లిన కొంతమంది యువకులు గ్రామానికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా వీరు తమ గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు.
అయితే ఈ రికార్డింగ్ డ్యాన్స్ పై కావలి రూరల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పుల్లారావు తన సిబ్బందితో కలిసి రికార్డింగ్ డ్యాన్స్ ను అడ్డుకోడానికి వెళ్ళారు. పోలీసులు వెళ్లే సరికి గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతోంది. అప్పటికే చాలామంది పురుషులు అక్కడ గుమిగూడిఉన్నారు. పోలీసులు ఈ డ్యాన్సులకు అడ్డుతగలడాన్ని తట్టుకోలేక ఏకంగా పోలీసులపైనే దాడి కి దిగారు. ఎస్సైని సముద్రపు నీటిలో ముంచి చంపడానికి ప్రయత్నించారు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అయితే గ్రామంలోని పెద్దమనుషులు గ్రామస్తులను సముదాయించి పోలీసులను కాపాడారు. మత్యకారుల దాడిలో ఎస్సై తో పాటు హోంగార్డు నాగరాజుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరితో పాటు కానిస్టేబుల్స్ క్రిష్ణయ్య, ప్రేమ్కుమార్, హోంగార్డులు రామచంద్రయ్యలకు కూడా గాయాలయ్యారు. ప్రస్తుతం వీరంతా కావలి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఈ ఘటనతో సంబంధమున్న 60 మంది మత్స్యకారులపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికారులను అటకాయించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రూరల్ సీఐ అశోక్వర్ధన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.