ప్రాణాలకు తెగించి.. ఆరుగురు ప్రాణాలు కాపాడిన వలంటీర్...

By AN TeluguFirst Published Mar 1, 2021, 10:42 AM IST
Highlights

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడో వాలంటీర్. ఆ మంటలకు తన ఒళ్లు కాలుతున్న లెక్క చేయకుండా దగ్థమవుతున్న గుడిసెలోంచి గ్యాస్ సిలిండర్ ను బైటికి తెచ్చి భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని నివారిచి శభాష్ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా రొపిచర్లలో ఈ ఘటన జరిగింది. 

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడో వాలంటీర్. ఆ మంటలకు తన ఒళ్లు కాలుతున్న లెక్క చేయకుండా దగ్థమవుతున్న గుడిసెలోంచి గ్యాస్ సిలిండర్ ను బైటికి తెచ్చి భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని నివారిచి శభాష్ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా రొపిచర్లలో ఈ ఘటన జరిగింది. 

రొంపిచర్లలో పేదలు నివసించే ప్రాంతంలో మొత్తం 12వరకు పూరి గుడిసెలో ఉన్నాయి. అందులో నాలుగు గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉండగా, మరో 8 గుడిసెలు కొద్ది దూరంలోనే ఉన్నాయి. శనివారం ఉదయం ఓ విద్యుత్ స్తంభం నుంచి తీగ తెగి పూరి గుడిసెపై పడింది. గుడిసెకు మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు పూరి గుడిసెలకు వ్యాపించాయి. 

ఆ టైంలో రెండు గుడిసెల్లో ఉన్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారులను వలంటీర్ బొజ్జా శివకృష్ణ బైటికి తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడాడు. తగలబడుతున్న మరో గుడిసెకు తాళం వేసి ఉంది. దీంతో వెంటనే తాళం పగలగొట్టి అందులోని గ్యాస్ సిలిండర్ బైటికి తీసుకొచ్చాడు. వలంటీర్ బొజ్జా శివకృష్ణ ఈ సాహసం చేయకపోతే సిలిండర్ పేలి పక్కనున్న ఏడెనిమిది గుడిసెలకు మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగి ఉండేది. 

ఈ ఘటనలో శివకృష్ణ ఒంటికి మంటలు అంటుకోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించి అందించారు. వైద్యశాలకు వెళ్లి వలంటీర్ శివకృష్ణను అభినందించారు. అతడి వైద్యానికయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. 

సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని, శివకృష్ణ లాంటి ఎందరో ఆ వ్యవస్థలో భాగస్వాములై ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

దీనిమీద వాలంటీర్ మాట్లాడుతూ.. మా ఇంటికి దగ్గర్లో ఉన్నట్టుండి హాహాకారాలు వినిపించాయి. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా మంటలు కనిపించాయి. కాలుతున్న ఓ గుడిసెలో వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నారు. వారిని రక్షించి, వెంటనే తగలబడుతున్న గుడిసెకు వేసి ఉన్న తాళాన్ని తీసి సిలిండర్ బైటికి తెచ్చాను. శరీరం, చేతులు, వేళ్లకు మంటలు అంటుకున్నాయి. బైటికి రాగానే స్పృహ తప్పి పడిపోయాను. చుట్టుపక్కల వారు నన్ను వెంటనే కారులో నరసరావుపేట ఆస్పత్రికి తీసుకొచ్చారు’ అని చెప్పుకొచ్చాడు. 

click me!