విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రమేశ్ హాస్పిటల్స్ చైర్మన్ రామ్మోహన్ రావు కోడలు రాయపాటి శైలజకి నోటీసులు ఇచ్చారు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రమేశ్ హాస్పిటల్స్ చైర్మన్ రామ్మోహన్ రావు కోడలు రాయపాటి శైలజకి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని శైలజను కోరారు.
ఇందుకు సంబంధించి గుంటూరులోని రమేశ్ హాస్పిటల్స్కు వస్తానని శైలజ చెప్పడంతో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం గుంటూరుకు వెళ్లింది. అమరావతి మహిళా జేఏసీలో కీలక పాత్ర పోషిస్తున్న శైలజ.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె.
కాగా స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్న విషయం తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రికి మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు సమర్పించలేదు.
కాగా, కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నోటీసులుఇచ్చినా కూడా తమ ముందు హాజరు కావడానికి సాకులు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు. 9 రోజులుగా తమ దర్యాప్తులో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.
పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలను పంపించారు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మరణించిన విషయం తెలిసిందే.