జూ.ఎన్టీఆర్ పేరెత్తి చంద్రబాబును ఏకేసిన వల్లభనేని వంశీ

Published : Nov 14, 2019, 05:17 PM ISTUpdated : Nov 14, 2019, 06:17 PM IST
జూ.ఎన్టీఆర్ పేరెత్తి చంద్రబాబును ఏకేసిన వల్లభనేని వంశీ

సారాంశం

పదేళ్ల క్రితం కెరీర్‌ను ఫణంగా పెట్టి పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారని... మళ్ళీ పార్టీలో జూనియర్ ఎందుకు కనిపించలేదని వంశీ ప్రశ్నించారు. 

భయంకరమైన వరదలు, వర్షాల్లో కూడా ఇసుకను బయటకి తీసే శక్తిని భగవంతుడు చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు టీడీపీ మాజీ నేత వల్లభనేని వంశీ. ఏ ప్రభుత్వం వచ్చినా మంచిపని చేస్తే సమర్ధించాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేత పాత్రను సమర్థంగా నిర్వహించలేక పోతున్నారని వంశీ ఎద్దేవా చేశారు.

కొత్త ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదని.. అప్పుడే ధర్నాలు, దీక్షలు ఏంటని వల్లభనేని ప్రశ్నించారు. పేదవారికి ఒక న్యాయం, డబ్బున్న వారికి ఒక న్యాయమా.. డబ్బున్న వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని వంశీ గుర్తు చేశారు.

పదేళ్ల క్రితం కెరీర్‌ను ఫణంగా పెట్టి పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారని... మళ్ళీ పార్టీలో జూనియర్ ఎందుకు కనిపించలేదని వంశీ ప్రశ్నించారు. ఏ ఎన్నికల్లోనైననా టీడీపీ ఒంటరిగా పోటీ చేసిందా అని ఆయన నిలదీశారు.

read more  టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ ఉద్యమంలో టీడీపీ ఎందుకు పాల్గొనడం లేదని వంశీ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని.. చంద్రబాబు తీరు ఇలాగే కొనసాగితే ప్రతిపక్షహోదా కూడా పోతుందని వంశీ జోస్యం చెప్పారు.

ప్రజా తీర్పును ఆమోదించాలని.. వారి తీర్పును అపహాస్యం చేయకూడదని ఆయన హితవు పలికారు. తెలంగాణలో సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణలో లాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీ పతనమైపోతుందని వంశీ జోస్యం చెప్పారు.

read more  వైసీపీలోకి అవినాష్.. వల్లభనేని వంశీ అలక....? కారణమేమిటంటే!

జయంతికి వర్థంతికి తేడా తెలియని పుత్ర రత్నం ఆయన సలహాదారుల కారణంగా తెలుగుదేశం పార్టీ అనే టైటానిక్ షిప్ మునిగిపోతుందన్నారు. అప్పుడు ధర్మాడి సత్యం టీం కూడా బయటకు తీయలేదని వంశీ సెటైర్లు వేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీడీపీకి కనీసం 2 వేల ఓట్లు కూడా రాలేదన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. 

జగన్‌కు మద్ధతిస్తే నాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఉండదని.. నాకు కేసులు కొత్త కాదని, వాటికి భయపడేది లేదని వంశీ స్పష్టం చేశారు. ఆర్ధిక లావాదేవీలు, కేసులకు భయపడో తాను వైసీపీకి మద్ధతు తెలపడం లేదన్నారు. ధర్మాపోరాట దీక్షలతో తెలుగుదేశం పార్టీకి ఒరిగిందేమిటని వంశీ ప్రశ్నించారు.

అక్రమ కేసులు బనాయించినా, బురద జల్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆమోదించి 151 సీట్లు కట్టబెట్టారని వంశీ గుర్తుచేశారు. అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని, మంచిపనులకు మద్ధతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు అనవసరమైన ఘర్షణలకు దిగకుండా మంచి పనిని.. మంచిగా ఆమోదిస్తే అందరికీ శ్రేయస్కరమని ఆయన హితవు పలికారు. వర్షాలు తగ్గితే ఇసుక ఇబ్బంది తొలగిపోతుందని వంశీ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu