నాకు ఎవరి కోచింగ్ అక్కర్లేదు .. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గన్నవరం అభ్యర్ధిని నేనే : వల్లభనేని వంశీ సంచలనం

By Siva KodatiFirst Published May 20, 2022, 3:29 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్ధిని తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. తన మీద ఎటువంటి విచారణకు అయినా డిమాండ్ చేసుకోవచ్చన్నారు. 
 

గన్నవరం వైసీపీలో విభేదాలపై స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే వెళ్ళానన్నారు. వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ కలుద్దాం అన్నారని.. తననేమీ అడగలేదని వంశీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి తానే అభ్యర్థినని..వైసీపీ టికెట్ పైనే పోటీ చేస్తానని వల్లభనేని ధీమా వ్యక్తం చేశారు. తన మీద ఎటువంటి విచారణకు అయినా డిమాండ్ చేసుకోవచ్చని.. అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలియదని వంశీ తెలిపారు. 

తన మీద ఆరోపణలపై విచారణ కోసం సీబీఐ, ఐక్యరాజ్యసమితికి కూడా లేఖలు రాయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.  అర్ధం లేని ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని వంశీ పేర్కొన్నారు. మూడు ఎన్నికలు ఎదుర్కొన్నవాడినని… ఏ ఊర్లో ఎవరితో పని చేయించుకోవాలో తనకు తెలుసునన్నారు. ఎవరి దగ్గరా కోచింగ్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని… నియోజకవర్గంలో తన పని తాను నేను చేసుకుంటున్నానని వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. 

కాగా.. సీఎం జగన్ (ys jagan), వైసీపీ (ysrcp)పెద్దలు పలుమార్లు మందలించిన గన్నవరం (gannavaram) వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi), దుట్టా రామచంద్రరావుల (dutta ramachandra rao) మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో విషయం సీఎంవో వరకు వెళ్లడంతో వారిద్దరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. 

గన్నవరం అంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి (telugu desam party) కంచుకోటే.. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఈయన టీడీపీలో ఉండగా, వైసీపీ నేతలకు, కార్యకర్తలకు చుక్కలు కనిపించాయని చెబుతూ వుంటారు. మరి అలాంటి నాయకుడు చివరికి వైసీపీకి జై కొట్టారు.. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో ఉన్న తన సన్నిహితుల ద్వారా జగన్‌కు వంశీ దగ్గరయ్యారు. ఆయన అడుగుపెట్టిన నాటి నుంచి గన్నవరం వైసీపీలో ఎప్పుడూ ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది.

తాజాగా వంశీకి.. వైసీపీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావుల (yarlagadda venkata rao) మధ్య రచ్చ జరుగుతోంది. వీరు వంశీ వర్గంపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు. అలాగే వంశీ తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ…అసలైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే ఇటీవల గన్నవరం వైసీపీ ఇంచార్జ్‌ని నియమించాలని కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా… గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కావడంతో మరోసారి ఎమ్మెల్యే వల్లభనేని వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. 2024లో పార్టీ టికెట్ వంశీకి కేటాయిస్తే సహకరించమని పార్టీ అగ్రనేతలకు వైసీపీ అసమ్మతి వర్గం హెచ్చరికలు పంపింది. నియోజకవర్గంలో వైసీపీకి కొత్త ఇంఛార్జ్ కావాలంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అలాగే జగన్ని కలిసి వంశీకి సీటు దక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ అగ్రనేతలతో వంశీకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి (kodali nani) ఆప్తమిత్రుడు కాబట్టి వంశీకి సీటు విషయంలో ఢోకా లేదని ప్రచారం జరుగుతోంది. 2024లో గన్నవరం వైసీపీ సీటు తమ నేతకే అని వంశీ వర్గం అంటోంది.
 

click me!